నూతన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఎర్రబెల్లి సందేశం

3 Jul, 2019 17:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంకితభావంతో పని చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న జిల్లా ప్రజాపరిషత్‌ చైర్‌పర్సన్‌లకు, వైస్‌ చైర్‌పర్సన్‌లకు, జెడ్పీటీసీలకు, మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, ఎంపీటీసీలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారికి ఓ సందేశాన్ని పంపారు. 

‘బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ దేశంలోనే ఆదర్శవంతమైన పాలన కొనసాగిస్తున్నారు. సుస్థిరమైన అభివృద్ధే లక్ష్యంగా కాళేశ్వరం, మిషన్‌ భగీరథ, హరిత హారం వంటి బృహత్తర ప్రాజెక్టులను చేపట్టారు. ఆదాయం పెంచాలి-పేదలకు పంచాలి అనే నినాదంతో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేయడంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా మీపై కీలక బాధ్యత ఉంది. మెరుగైన పరిపాలన అందించడం లక్ష్యంగా సీఎం కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. స్థానిక సంస్థల పునర్విభజనతోపాటు వాటికి ఎన్నో అధికారాలను, బాధ్యతలను అప్పగించారు. పాలనలో జవాబుదారీతనం పెంచేలా కొత్త చట్టాన్ని రూపొందించారు. పల్లెల వికాసంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యం అనే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. ఇదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధనలో మీరు భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ... అందరికీ  శుభాకాంక్షలు' అని మంత్రి దయాకర్ రావు లేఖలో పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు