కాంగ్రెస్‌కు లీడర్‌ లేడు.. బీజేపీకి కేడర్‌ లేదు

9 Apr, 2019 18:27 IST|Sakshi
రోడ్‌షోలో మాట్లాడుతున్న మంత్రి దయాకర్‌రావు 

     పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 

తొర్రూరు(పాలకుర్తి) : తెలంగాణ రాష్ట్రంలోని జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌కు లీడర్‌ లేడు.. బీజేపీకి కేడర్‌ లేదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్‌ కేంద్రంలోని గాంధీ సెంటర్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన రోడ్‌షో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపి గత శాసనసభ ఎన్నికల్లో పార్టీకి భారీ మెజార్టీ ఇచ్చారని చెప్పారు. దీంతో రాష్ట్రంలోని జాతీయ పార్టీలన్నీ డీలా పడిపోయాయన్నారు. అందుకే జాతీయ పార్టీలకు చెందిన పెద్ద పెద్ద నాయకులు, కార్యకర్తలంతా టీఆర్‌ఎస్‌ పార్టీలోకి భారీ సంఖ్యలో వరుస కడుతున్నారని చెప్పారు.

ఇప్పటికే సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తున్నారని, ఇలాంటి నాయకుడు తమకు కూడా ఉంటే బాగుంటుంద ని ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత దేశంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు కలిపి 250 సీట్లు వచ్చే పరిస్థితి లేదని అన్నారు. తెలంగాణలో 17 ఎంపీ సీట్లను గెలిపిస్తే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల ఎంపీలతో కలిపి మొత్తం 160 సీట్లను జమచేసి దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ చక్రం తిప్పుతారని తెలిపారు. అవసరమైతే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుందని వివరించారు. అనంతరం మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్య ఉండే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు 54వేల మెజార్టీ ఇచ్చి గెలిపిం చడం వల్లే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కిందన్నారు.

అదే స్ఫూర్తితో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇంటింటికీ తిరిగి టీఆర్‌ఎస్‌ అభర్థికి ఓట్లు వేయాలని పార్టీలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలను అడగాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌రావు, మండల నాయకులు గుడిపూడి మధుసూదన్‌రావు, పసుమర్తి సీతారాములు, ఈదురు ఐలయ్య, ఎంపీపీ సోమయ్య, రామచంద్రయ్యశర్మ, సోమేశ్వర్‌రావు, హరిప్రసాద్, వెంకటనారాయణగౌడ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు