దయగల వాడే మా " దయన్నా"

19 Nov, 2018 11:03 IST|Sakshi

 ‘సాక్షి’ ఇంటర్వ్యూలో టీఆర్‌ఎస్‌ పాలకుర్తి అభ్యర్థి దయాకర్‌రావు

సాక్షి,  పాలకుర్తి: తన ఇంటికి సమస్యలతో సహాయం కోసం వచ్చిన వారికి చేయలేనని చేప్పకుండా సహాయం చేసే మహానాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు. ఆందుకే అక్కడి ప్రజలందరూ ఆయనను దయగల వాడే మా " దయన్నా" అంటారు.  పాలకుర్తి నియోజకవర్గం సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని, దశాబ్దాలుగా బీళ్లు మారిన భూములకు సాగునీరందించి సస్యశ్యామలం చేస్తానని టీఆర్‌ఎస్‌ పాలకుర్తి అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఎన్నికల్లో ఓటమి ఎరుగని ధీరుడిగా పేరున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. ఈ సారి 50 వేలకు పైగా మెజార్టీ సాధిస్తానని ధీమాతో  ఉన్నారు. సోమవారం ఆయన నామినేషన్‌ వేస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్నబహిరంగ సభకు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు ‘సాక్షి’   ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు వెల్లడించారు. 

సాక్షి: నామినేషన్‌ కార్యక్రమానికి ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ రావడం ఎలా ఫీలవుతున్నారు ?
దయాకర్‌రావు: సీఎం కేసీఆర్‌ నామినేషన్‌ వేసుకున్న తర్వాత రాష్ట్రంలో కేవలం పాలకుర్తిలో నా నామినేషన్‌ కార్యక్రమానికి మాత్రమే హాజరు కావడం ఆనందంగా ఉంది. 
సాక్షి: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ నుంచి ఎలాంటి వరాలు కోరబోతున్నారు..? 
దయాకర్‌రావు: గతంలో సీఎం కేసీఆర్‌ పాలకుర్తికి వచ్చిన సందర్భంగా పాలకుర్తి, వల్మిడి, బమ్మెర పర్యాటక ప్రాంత అభివృద్ధికి రూ.22 కోట్లు, పాలకుర్తిని సిద్ధిపేట, ఖమ్మం తరహాలో తీర్చిదిద్దడానికి రూ. 25 కోట్లు నిధులు మంజూరు చేశారు. టెండర్లు పూర్తయ్యాయి. పనులు పురోగతిలో ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథలో తాగునీరు, 4,500 డబుల్‌ బెడ్‌ రూంల నిర్మాణాలు, దేవాదుల ప్రాజెక్టు, ఎస్సారెస్పీ ద్వారా సాగు నీరందించేందుకు నిధులు, ఇతర అభివృద్ధి పనులకు సుమారు రూ. 700 కోట్ల నిధులు ప్రత్యేకంగా మంజూరు చేశారు. మండల కేంద్రాల్లో 100 పడకల ఆసుపత్రులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, వృత్తి విద్యా కోర్సు కళాశాలలు మంజూరు చేయాలని కోరుతా. 
సాక్షి: సీఎం బహిరంగ సభ గెలుపుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది.  
దయాకర్‌రావు: సీఎం కేసీఆర్‌ సభకు రావాలని కార్యకర్తల సమావేశంలో మాట్లాడితే ఊహించని విధంగా స్పందన వస్తుంది. గ్రామానికి సగటున 500 మందిని తరలించాలని కోరితే  1000 మందిని తీసుకొస్తామని కార్యకర్తలు చెబుతున్నారు. వారి ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అంచనాకు మించి ప్రజలు సభకు తరలివస్తారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించే నియోజకవర్గాల్లో పాలకుర్తి ఉండబోతుంది.
సాక్షి: మళ్లీ గెలిస్తే చేయబోయే పనులేమిటి ? 
దయాకర్‌రావు: నియోజకవర్గంలో అత్యధికంగా సుమారు 80 శాతం మంది ప్రజలకు ఉపాధి కల్పించే వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయాలి. ప్రతి గ్రామంలోని బీడు భూములకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తా. వ్యవసాయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నియోజకవర్గం సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా. తనకు భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకుంటా.

మరిన్ని వార్తలు