పేదలకు నిత్యావసర సరుకులు

20 Jun, 2020 05:03 IST|Sakshi
గాంధీభవన్‌లో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న ఉత్తమ్‌. చిత్రంలో కాంగ్రెస్‌ నేతలు 

రాహుల్‌ జన్మదినం సందర్భంగా గాంధీభవన్‌లో పలు సేవా కార్యక్రమాలు

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ 50వ జన్మదినోత్సవాన్ని పురçస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు ఎలాంటి హంగూ, ఆర్భాటాలు లేకుండా పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ, అన్నదానం, రక్తదాన కార్యక్రమాలతో పాటు, కరోనా ఫ్రంట్‌ వారియర్స్‌కు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం గాంధీ భవన్‌లో రాష్ట్ర ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్రావు నేతృత్వంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారం భించగా గ్రేటర్‌ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు మనోజ్‌ కుమార్‌ కుటుంబానికి ఎన్‌ఎస్‌యూఐ తరఫున 50వేల రూపాయల చెక్కును వారి బంధువులకు అందచేశారు. ఈ సందర్భం గా ఉత్తమ్‌ మాట్లాడుతూ రాహుల్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని  సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ శ్రేణులను అభినందించారు. గాల్వాన్‌ అమరవీరుల ఆత్మ శాంతి కోసం 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.

మరిన్ని వార్తలు