కేంద్రమంత్రికి బీజేపీ రాష్ట్ర నేతల విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్లో ఏవియేషన్ వర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి సురేశ్ప్రభును బీజేపీ రాష్ట్ర నేతలు కోరారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలసి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం, ఎయిర్ఫోర్స్ అకాడమీ, ఎయిర్ వార్ఫేర్ కాలేజీ లు ఉన్నాయని, అలాగే, ఏవియేషన్ వర్సిటీని కూడా ఏర్పాటు చేసి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ డిప్లొమా, మేనేజ్మెంట్ కోర్సులను ప్రారంభించడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చని వివరించారు.
హైదరాబాద్లో ఉన్న ఫారెస్ట్ రీసెర్చ్ సంస్థకు నిధులు పెంచాలని కోరుతూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ను కలసి నేతలు కోరారు. తెలంగాణలోని బౌద్ధ ప్రదేశాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె.జె.ఆల్ఫోన్స్ దృష్టికి తీసుకెళ్లారు. సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి, జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల, కరీంనగర్ జిల్లాలోని ధూళికట్ట, నల్లగొండ జిల్లాలోని బుద్ధవనం, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని బౌద్ధ ప్రదేశాలను బుద్ధిస్ట్ సర్క్యూట్లో భాగంగా అభివృద్ధి చేయాలని కోరారు.