ఆయుర్వేదానికి పూర్వ వైభవం: ఈటల 

26 Aug, 2019 03:22 IST|Sakshi

సోమాజిగూడ: ఆయుర్వేద వైద్యానికి రానున్న కాలంలో ఆదరణ పెరగనుందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. ప్రభుత్వాలపరంగా ఆయుష్కు అంత పోత్సాహం లేనప్పటికీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే పాత పద్ధతులను మళ్లీ ప్రజలు ఆచరిస్తున్నా రని అనిపిస్తోందన్నారు. ఆరోగ్య సూ త్రాలలో భాగంగా ఒకప్పుడు గరీబోళ్లు తినే తిండి రాగులు, సజ్జలు ప్రస్తుతం సంపన్నుల తిండిగా మారిందన్నారు. ఆదివారం అమీర్‌పేట్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ ఆడిటోరియంలో విశ్వ ఆయుర్వేద పరిషత్‌ తెలంగాణశాఖ ఆధ్వర్యంలో ‘ప్రాణాభిసార–2019’పేరుతో జరి గిన జాతీయ సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. పాత తరంలో తీసుకునే ఆహారానికి ప్రాధాన్యత వచ్చిన విధంగానే ఆయుర్వేద వైద్యం పూర్వ వైభవం పొందనుందని తెలిపారు. ప్రస్తుతం పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ వైద్యానికి రూ.లక్షలు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ సమ్మిరెడ్డి, మినిస్ట్రీ ఆఫ్‌ ఆయుష్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ సింగ్, రాష్ట్ర ఆయుష్‌ డైరెక్టర్‌ అలగు వర్షిణి తదితరులు పాల్గొన్నారు.  

‘డాక్టర్లకు జియో ట్యాగ్‌ అమలుచేయబోం’ 
సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ దవాఖానాల్లో పనిచేస్తున్న ఆయుష్‌ డాక్టర్లు, సిబ్బంది అటెండెన్స్‌ నమోదుకు జియో ట్యాగింగ్‌ అమలు చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఈ మేరకు మంత్రి ఈటల రాజేందర్‌ తమకు హామీ ఇచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (ప్రజారోగ్య విభాగం) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లాలూ ప్రసాద్‌ రాథోడ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై తాము మంత్రిని కలిసి విన్నవించినట్లు చెప్పారు. వెంటనే ఆయుష్‌ ఉన్నతాధికారులకు సోమవారం ఆదేశాలు ఇస్తానని మంత్రి పేర్కొన్నారని లాలూ ప్రసాద్‌ వెల్లడించారు. ఆయుష్లో పనిచేస్తున్న స్వీపర్ల నుంచి డాక్టర్ల వరకూ ప్రతి ఒక్కరూ తమ ఫోన్‌లో అటెండెన్స్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. జియో ట్యాగింగ్‌లా పనిచేసే ఈ యాప్‌ ద్వారానే ప్రతి రోజూ అటెండెన్స్‌ నమోదు చేయాల్సి ఉంటుంది. ఆఫీస్‌ సమయంలో లొకేషన్‌ యాక్సెస్‌ ఉన్నతాధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు