గాలి ద్వారా కరోనా సోకదు : ఈటల

3 Mar, 2020 16:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌(కోవిడ్‌-19) గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరోనా వైరస్‌పై భయాందోళనలు నెలకొన్న క్రమంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నివారణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ. 100 కోట్ల నిధులు విడుదల చేయడంతో పాటు.. కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. కరోనా వచ్చిన వ్యక్తిని 88 మంది కలిసినట్టు సమాచారం అందిందన్నారు. వారిలో 45 మందికి గాంధీలో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కరోనా బాధితుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని.. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. ఎబోలా కంటే కరోనా భయంకరమైనది కాదని అన్నారు. 80 వేల మందికి కరోనా సోకితే.. 2 వేలకు పైగా మాత్రమే మృతిచెందారని చెప్పారు. 

గాలి ద్వారా కరోనా సోకే అస్కారం లేదని ఈటల తెలిపారు. మనిషి మాట్లాడినప్పుడు తుంపిర్ల ద్వారా మాత్రమే సోకే అవకాశం ఉందన్నారు. కరోనా సోకకుండా ఉండేందుకు ప్రజలు కొన్ని జాగ్రత్తలు, శుభ్రత పాటించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో నివసించే ఒక్కరికి కూడా కరోనా సోకలేదని చెప్పారు. కరోనా కోసం గాంధీతో పాటు చెస్ట్‌ హాస్పిటల్‌, మిలటరీ హాస్పిటల్‌, వికారాబాద్‌ అడవుల్లో ఉన్న హాస్పిటల్‌ను వాడతామని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ సోకినట్టు అనుమానం వస్తే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాని సూచించారు. ప్రైవేటు మెడికల్‌ కాలేజ్‌ల్లో 3 వేల బెడ్స్‌తో ముందుస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని.. తెలంగాణలో మాస్క్‌ల కొరత ఉందని, మాస్క్‌లు అందించాల్సిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. (చదవండి : కోవిడ్‌-19, ట్విటర్‌ కీలక ఆదేశాలు)

అన్ని రకాలు ప్రయాణాలు చేసేవారు  జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కరోనా అనుమానాల నివృత్తి కోసం హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 104ను ఏర్పాటు చేశామని.. రేపటి నుంచి నెంబర్‌ పనిచేస్తుందని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో నివారణ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కరోనా వ్యాప్తి చెందిన దేశాలకు వెళ్లేవారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. (చదవండి : కరోనా అలర్ట్‌: ‘మాస్కులకు ఆర్డర్లు ఇస్తే మంచిది’)

మరిన్ని వార్తలు