ఎవరికి వారే..!

8 Jan, 2015 04:10 IST|Sakshi

వెనుకబడిన, వలసల జిల్లాగా పేరొందిన పాలమూరులో సమస్యలు సవాలక్ష.. వాటిని పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు.. కలెక్టర్, ఇతర  విభాగాల మధ్య సమన్వయం లోపించింది. తక్షణ వాటిపైనే ఉరుకులు పరుగులు తీస్తూ.. పెండింగ్ సమస్యలు పట్టించుకోవడం లేదు. జిల్లా సమగ్రాభివృద్ధిపై సమీక్షలు కనిపించడం లేదు.  క్షేత్రస్థాయి పర్యటనలు ముందుకు సాగడం లేదు.. వెరసి జిల్లా పాలనాయంత్రాంగం పనితీరు ఎవరికివారే.. యమునా తీరే..! అనే చందంగా మారింది.
 
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలనా యంత్రాంగం పనితీరు దిశా నిర్దేశం లేకుండా సాగుతుండటంతో జిల్లాలో చిన్నాచితక సమస్యలు దీర్ఘకాలంగా అలాగే ఉండిపోతున్నాయి. సంక్షేమ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. ఇతర సమస్యలపై దృష్టి సారించకపోవడంతో సామాన్యులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పరిస్థితి నెలకొంది.      

ప్రభుత్వశాఖల వారీగా సమీక్షలు కొరవడడంతో కొన్ని ప్రభుత్వ విభాగాల ఉనికి నామమాత్రంగా తయారైంది. కొన్ని విభాగాల సమీక్షలు అధికారులు సమర్పించే మొక్కుబడి నివేదికలతో ముగుస్తున్నాయి. పర్యవేక్షణ, సమీక్షల ద్వారా పనితీరుపై మదింపు జరగకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది.

పాలనా యంత్రాంగానికి సారథ్యం వహించే కలెక్టర్, ఇతర అధికారులు, సిబ్బందికి నడుమ సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మధ్య పొంతన కుదరక పాలనపై ప్రభావం చూపుతోంది. జిల్లాలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న జాయింట్ కలెక్టర్‌ను కలెక్టర్ విశ్వాసంలోకి తీసుకోవడం లేదని కలెక్టరేట్ సిబ్బంది బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ పరిధిలోని ఇసుక అనుమతులు అంశాన్ని తప్పించి డీఆర్వో నేతృత్వంలోని ‘సాండ్ సెల్’కు
 
అప్పగించడం ఇద్దరి మధ్య నెలకొన్న అగాథాన్ని సూచిస్తోంది. రుణమాఫీ లబ్ధిదారుల జాబితా, సామాజిక పింఛన్లు, ఆహార భద్రత కార్డుల లబ్ధిదారుల గుర్తింపు వంటి విషయాల్లో రెవెన్యూ యంత్రాంగం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది.
 
ఆగిన క్షేత్రపర్యటనలు
బాధ్యతలు స్వీకరించిన కొత్తలో క్షేత్రస్థాయి పర్యటనలతో తీరిక లేకుండా గడిపిన కలె క్టర్ ప్రస్తుతం కార్యాలయానికి ఎక్కువగా పరిమితమవుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వే, రుణమాఫీ, సామాజిక పింఛన్ల లబ్ధిదారుల గుర్తింపు వంటి పనుల్లో కలెక్టర్ ఒత్తిడి చేయడంపై ఓ దశలో ఉద్యోగులు ‘వర్క్ టు రూల్’ పేరిట నిరసనకు దిగారు. జాబితాల పరిశీలన, కంప్యూటరీకరణ, వీడియో కాన్ఫరెన్స్‌లతో కుటుంబంతో గడిపే పరిస్థితి లేకుండా పోయిందని ఉద్యోగులు ఆక్షేపించారు.

నవంబర్ 8న సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో ఉద్యోగులతో కలెక్టర్ రాజీకుదుర్చుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ‘తమకూ యూనియన్లు ఉన్నాయని’ ఆవేదన వ్యక్తంచేసిన కలెక్టర్ ఆ తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలను పూర్తిగా తగ్గించారు. ‘అనేక అంశాలపై దిశా నిర్దేశం కోరేందుకు కలెక్టర్ వద్దకు వెళ్తున్నాం. కానీ పూర్తిస్థాయిలో చర్చించే పరిస్థితి లేక వెనుదిరగాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి అందే తక్షణ ఆదేశాలపైనే అధికార యంత్రాంగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో ఇతర శాఖల అంశాలపై పూర్తి స్థాయి సమీక్ష జరగడం లేదు’ అంటూ కొందరు అధికారులు లోలోన వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు