సర్వే జనా సుఖినోభవంతు!

19 Aug, 2014 00:27 IST|Sakshi
సర్వే జనా సుఖినోభవంతు!
  •      ఉదయం 7.00 గంటల నుంచి ప్రారంభం
  •      ఫిర్యాదులకు కాల్‌సెంటర్ 040-21 11 11 11
  •      జిరాక్స్‌లు ఇవ్వనవసరం లేదు
  • సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. మంగళవారం జరుగనున్న మహాక్రతువుకు రెండు రోజుల ముందు నుంచే ప్రీ విజిట్లు నిర్వహించిన ఎన్యూమరేటర్లు క్షేత్ర స్థాయిలో ఇబ్బందులను గుర్తించారు. ఇంటింటికీ కరపత్రాలు.. అవి అందినట్లుగా స్టిక్కర్లు అతికించారు. తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదంటూ వివిధ ప్రాంతాల నుంచి జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదులు అందుతుండడంతో జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌లోని ఫోన్ లైన్లను 30 నుంచి 50కి పెంచారు. ఆదివారం 13.40 లక్షల ఇళ్లను సందర్శించిన సిబ్బంది .. 2.06 లక్షల ఇళ్లు కొత్తగా వచ్చినట్లు గుర్తించారు.
     
    సాక్షి, సిటీబ్యూరో:సర్వేకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని కమిషనర్ చెప్పారు. రెండు రోజుల పాటు సాగిన క్షేత్ర స్థాయి పర్యటనలలో కొన్ని ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయని, అవసరానికి సరిపడా సామగ్రిని సిద్ధం చేశామన్నారు. అదనపు  సిబ్బందిని నియమించుకునేందుకు ఎన్యూమరేటర్లకు వెసులుబాటు కల్పించామని చెప్పారు. ఏ ప్రాంతాల్లోనైనా సర్వే జరుగని పక్షంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. సర్వేలో సహకరించేందుకు సహాయ ఎన్యూమరేటర్లుగా విద్యార్థులతోపాటు వివిధ వర్గాల వారిని నియమించుకున్నప్పటికీ..ఎన్యూమరేటరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

    కొన్ని ప్రాంతాల్లో సోమవారం ప్రీ విజిట్లకు వెళ్లిన ఎన్యూమరేటర్లు సర్వేను సైతం పూర్తి చేశారు. సర్వేలో భాగంగా వివరాలు అందజేయడమే తప్ప.. జిరాక్స్‌లు ఇవ్వాల్సిన అవసరం లేదని కమిషనర్ సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్ నుంచి సర్వే ఫారాలను 25వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని కమిషనర్ చెప్పారు. ప్రీ విజిట్లలో దృష్టికొచ్చిన అంశాలు.. అందుకనుగుణంగా తీసుకుంటున్న చర్యలు..ఏర్పాట్లు తదితర అంశాలను కమిషనర్ సోమేశ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి.
     
    పెరిగిన గృహాలు
     
    2011 జనాభా లెక్కల మేరకు గ్రేటర్‌లో దాదాపు 13 లక్షల ఇళ్లుండగా.. ఇటీవలి సర్వేలో 16.96 లక్షల ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. మరో మూడు లక్షల ఇళ్లు అదనంగా వచ్చినా ఇబ్బందులు లేకుండా సర్వే పూర్తి చేయాలనే ఉద్దేశంతో సిబ్బంది నియామకాలతోపాటు కరపత్రాలు.. స్టిక్కర్లు పంపిణీ చేశారు. ఆదివారం ప్రీ విజిట్‌లో 13.40 లక్షల ఇళ్ల సర్వే జరగ్గా, అందులో 2.06 లక్షల ఇళ్లు కొత్తగా వచ్చినట్లు గుర్తించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని 21 లక్షల ఇళ్లకు సరిపడా మెటీరియల్‌ను అందజేశామని కమిషనర్ తెలిపారు. ఇంకా సరఫరా చేస్తున్నామన్నారు.
     
     21,636 ఇళ్లకు తాళాలు
     ఇంటింటి సర్వేను పురస్కరించుకొని సొంత గ్రామాలకు వెళ్లిన వారూ తక్కువేమీలేరు. ఆదివారం నాటి సర్వేలో 21,636 ఇళ్లకు తాళాలు ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు.
     
    ఒక్క ఇల్లూ తప్పిపోకూడదనే..
    గ్రేటర్ నగర విస్తీర్ణం ఎక్కువగా ఉండటం.. జనసాంద్రత భారీగా ఉండటంతో ఏ ఒక్క ఇల్లు కూడా తప్పిపోకుండా సర్వే నిర్వహించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కమిషనర్ చెప్పారు. మనుషులు చెట్లు కింద ఉన్నా, రోడ్డు పక్కన పొయ్యి ఉన్నా... వారి వివరాలు నమోదు చేయాల్సిందేనన్నారు. ఇది మనుషులకు సంబంధించిన సర్వే తప్ప ఆస్తులకు సంబంధించినది కాదన్నారు. సంచార జాతుల వారి వివరాలూ నమోదు చేస్తామన్నారు.
     
    జిరాక్స్‌లతో పని లేదు
     
    ఎన్యూమరేటర్లు సర్వేకు వచ్చినప్పుడు గందరగోళానికి గురి కాకుండా ఉండేందుకు, ఆధార్ కార్డు..ఆస్తిపన్ను నెంబరు(పీటీఐఎన్), బ్యాంక్ అకౌంట్, గ్యాస్ కనెక్షన్ వంటి వాటి నెంబర్లలో పొరపాట్లకు తావులేకుండా చూసేందుకే జిరాక్స్ కాపీలు అందుబాటులో ఉంచుకోవాలని చెబుతున్నాం తప్ప వాటిని సర్వేయర్లకు ఇవ్వాల్సిన అవసరం లేదని కమిషనర్ స్పష్టం చేశారు. కేవలం ఎన్యూమరేటర్ల ధ్రువీకరణ కోసమే జిరాక్స్‌లు ఉంటే మంచిదనే ఉద్దేశంతో ఈ సూచన చేశామన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలనడం వెనుక కూడా మరో కారణం లేదన్నారు.
     
    బ్యాంకు ఖాతా వివరాలు ప్రజల ఇష్టం ..
    బ్యాంకు ఖాతా నెంబరు తెలపాలా.. వద్దా అనేది ప్రజల నిర్ణయమేనని, బలవంతం లేదని కమిషనర్ చెప్పారు. ఇచ్చినా తగు భద్రత ఉంటుందని, భయపడాల్సిన పనిలేదని భ రోసా ఇచ్చారు.
     
    ఎన్యూమరేటర్‌కు 40 ఇళ్లు..
    ఒక్కో ఎన్యూమరేటర్‌కు సర్వే చేయాల్సిన ఇళ్లు 40కి మించకుండా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు. అత్యవసర పనుల మీద వెళ్లినవారు.. విదేశాల్లో ఉంటున్న వారికి సంబంధించి ఏవైనా ఆధారాలు చూపితే చాలునన్నారు.
     
    ప్రత్యేక సాఫ్ట్‌వేర్...
    సమగ్ర కుటుంబ సర్వేలోని వివరాల డేటాబేస్ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించి, 15 రోజుల్లో కంప్యూటరీకరిస్తామన్నారు. ఈ జాబితా ఆధారంగానే భవిష్యత్‌లో ఏ పథకానికి ఏ వివరాలు అవసరమవుతాయో వాటిని వినియోగిస్తామన్నారు. బదిలీలైనప్పుడు, ఇల్లు మారినప్పుడు సవరించేందుకు వీలుగా డేటాబేస్‌లో మార్పులూ చేర్పులకు వీలుంటుందని కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. సర్వే కేవలం బీపీఎల్ కుటుంబాలకు సంబంధించినది మాత్రమే కాదని, ఏపీఎల్ కుటుంబాలకూ పనికివచ్చేదన్నారు. సర్వేలో పాల్గొనకుంటే భవిష్యత్‌లో కొన్ని ప్రయోజనాలు కోల్పోయే అవకాశాలుంటాయన్నారు. ఆర్థిక పరిస్థితి, స్థానికతకు సంబంధించి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, సర్వేలో ఈ వివరాలు లేవని చెప్పారు. డేటా దుర్వినియోగం జరిగేందుకు ఆస్కారం లేదని, అత్యంత భద్రంగా ఉంటుందన్నారు. సర్వేలో హిజ్రాల వివరాల నమోదుకూ ఏర్పాట్లు ఉన్నాయన్నారు.
     
    ఫిర్యాదుల పరంపర...
    ఆదివారం సాయంత్రం నుంచీ తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదంటూ ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్‌కు రోజుకు సగటున 300 ఫిర్యాదులు అందేవి. ఆదివారం ఈసంఖ్య 5,616కు చేరింది. సోమవారం రాత్రి 8.40 గంటల వరకు 4776 ఫిర్యాదులు అందాయి. ఫోన్లు నిరంతరం బిజీగా ఉండటంతో చాలామందికి అసలు లైన్లే కలవలేదు. ఈ పరిస్థితిని గుర్తించి కాల్‌సెంటర్‌లోని 30 లైన్లకు తోడు అదనంగా మరో 20 లైన్లు పెంచారు. ప్రస్తుతం 50 లైన్లు పని చేస్తున్నాయని కమిషనర్ తెలిపారు. దీంతోపాటు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని..స్థానిక డిప్యూటీ కమిషనర్‌కు సైతం ఫిర్యాదు చేయవచ్చునన్నారు. వెబ్‌సైట్ కంటే ఫోన్‌కాల్స్ ద్వారా త్వరితంగా చర్యలకు వీలవుతుంది.
         
    సర్వే పరిశీలనకోసం నోడల్ ఆఫీసర్లు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తారు. తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాని విషయాన్ని నోడల్ ఆఫీసర్లకు సైతం తెలియజేయవచ్చు.
     
    అంతిమ నిర్ణయం ప్రజలదే..
    సర్వేలో భాగంగా కుటుంబ వివరాలు.. ఇతరత్రా సమాచారం తెలియజేయవచ్చా? లేదా అనేది అంతిమంగా ప్రజల నిర్ణయమేనని, ఏదీ కచ్చితం కాదన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టబోయే వివిధ పథకాలకు.. ఇతరత్రా అవసరాలకు సర్వే ద్వారా నమోదైన డేటా ఉండటం అవసరమన్నారు. ఉదాహరణకు భవన నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకున్నా.. ఆన్‌లైన్‌లో వివరాలు ఉన్నాయోమో చూస్తారని, లేని పక్షంలో ఇబ్బంది ఎదురు కావచ్చన్నారు. కుటుంబానికి సంబంధించిన మొత్తం సమాచారం ఇస్తే మంచిదన్నారు.
     
    సర్వే సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరుగుకుండా పోలీసు సహకారాన్ని కోరుతున్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ, 7500 మంది పోలీసులే ఎన్యూమరేటర్లుగా ఉన్నారని తెలిపారు. చాలా ప్రాంతాలకు ఎన్యూమరేటర్లు రాలేదని, ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో.. మేయర్ వార్డులో సైతం చాలామంది ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదనగా.. అన్ని ప్రాంతాలకూ వస్తారని, రాని పక్షంలో కాల్‌సెంటర్, వెబ్‌సైట్‌ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని, తగు ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు. ఎన్ని ఏర్పాట్లు చేసినా.. సర్వే జరగకుండా మిగిలిపోయే ఇళ్లుంటే... పరిస్థితేమిటన్న ప్రశ్నకు బదులిస్తూ.. అలాంటి వాటి విషయంపై ఆలోచిస్తామన్నారు. తాళాలు ఉన్న వాటితో పాటు మిగిలిపోయిన ఇళ్ల విషయాలపైనా ప్రభుత్వ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.  
     

మరిన్ని వార్తలు