మాజీ చైర్‌పర్సన్‌ కంటతడి

15 Jan, 2020 08:26 IST|Sakshi

ఆదిలాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో మరోమారు కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు 48వ వార్డుకు టీఆర్‌ఎస్‌ తరుపున నామినేషన్‌ దాఖలు చేసిన మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రంగినేని మనీష పవన్‌రావు కంటతడి పెట్టారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో టీటీడీసీలో ఏర్పాటు చేసిన ఉపసంహరణ కేంద్రానికి భర్తతో కలిసి వచ్చారు. తనకు బీ–ఫామ్‌ అందకపోవడంతో నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. గత ఐదేళ్లుగా టీఆర్‌ఎస్‌ పార్టీకి సేవలందిస్తూ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పట్టణ ప్రజలకు నిస్వార్థ సేవలను అందజేశానని కంటతడి పెట్టారు. అటువంటి తనను పట్టణ ప్రజలు తమ ఇంటి ఆడబిడ్డగా చూసుకున్నారని కన్నీరుమున్నీరయ్యారు.

ఓ పెద్ద మనిషి గెలుపుకోసం ఆహర్నిషలు కృషి చేశానని, అటువంటిది కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు కూడా బీ–ఫామ్‌ ఇవ్వలేదన్నారు. పార్టీ అధిష్టానం కూడా ఇప్పటి వరకు చైర్మన్‌ అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ తన కొడుకును చైర్మన్‌ అభ్యర్థిగా నిర్ణయించుకున్నామని, నన్ను తప్పుకోవాలని సోమవారం రాత్రి ఇంటికి వచ్చి ఒత్తిడి చేయడం సరికాదని ఆవేధన చెందారు. చైర్‌పర్సన్‌గా పని చేసిన నీవు కౌన్సిలర్‌గా ఉండకూడదంటూ ఒత్తిడి తేవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పట్టణ ప్రజలకు సేవలందించిన నాకు వార్డు ప్రజలకు సేవందించే అవకాశం కల్పించమని కోరినా వినలేదని పేర్కొన్నారు.    

>
మరిన్ని వార్తలు