'కేసీఆర్ ఓ మాయలోడు'

19 Mar, 2015 22:25 IST|Sakshi
'కేసీఆర్ ఓ మాయలోడు'

సరూర్‌నగర్ (హైదరాబాద్): తెలంగాణ రాగానే మొదటి సీఎంగా దళితుడిని చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తానే సీఎం కుర్చీలో కూర్చున్న మాయలోడని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ హోంమంత్రి సబితారెడ్డి ఘాటుగా విమర్శించారు. గురువారం బాలాపూర్ చౌరస్తాలోని చిగురింత కృష్ణారెడ్డి గార్డెన్‌లో కాంగ్రెస్ బలపరిచిన ఎంఎల్‌సీ అభ్యర్థి ఆగీరు రవికుమార్ గుప్తా ప్రచార సమావేశం నిర్వహించారు. సబితతోపాటు మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తెలంగాణ ఏర్పాటుకోసం పోరాడిన వారు చాలా మంది ఉండగా, వారిని కాదని స్వార్థంతో స్థానికేతరుడైన దేవి ప్రసాద్‌ను అభ్యర్థిగా బరిలోకి దింపటం విడ్డూరమన్నారు.

కేసీఆర్ అచ్చమైన దొరలపాలన సాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆగీరు రవికుమార్ గుప్తాను గెలిపించాలని సబిత పార్టీ శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ సామ నర్సింహగౌడ్, వైస్‌చైర్మన్ చిగురింత నర్సింహారెడ్డి, మాజీ జెడ్పీటీసీ చల్లా నర్సింహారెడ్డి, పెంటారెడ్డి, పార్టీ నగర పంచాయతీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామ నర్సింహారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు మర్రి హన్మంత్‌రెడ్డి, మాజీ ఎంపీపీ లావణ్య బీరప్ప, బడంగ్‌పేట నగర పంచాయతీ కౌన్సిలర్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు