సాక్షిప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో ఆల్ప్రాజోలం అక్రమ దందా ఆగడం లేదు. రాష్ట్రంలో ఆల్ప్రాజోలం అక్రమ తయారీ ఆగిందని రాష్ట్ర ఎక్సైజ్శాఖ భావిస్తున్న తరుణంలో ఈ నిషేధిత డ్రగ్ పెద్ద ఎత్తున పట్టుబడడం ఆ శాఖను ఒకింత ఉలిక్కిపాటుకు గురి చేస్తోంది. గుజరాత్, మధ్యప్రదేశ్ (ఇండోర్), మహారాష్ట్ర వంటి ప్రాంతాల నుంచి డ్రగ్స్ రాష్ట్రంలోకి రవాణా అవుతున్నట్లు తేలింది. కేం ద్ర రెవెన్యూ ఇంటలిజెన్స్ ఉన్నతాధికారుల బృందం ఇటీవల రూ. 2.40 కోట్లు విలువ చేసే 40 కిలోల ఆల్ప్రాజోలంను నాగ్పూర్ – హైదరాబాద్ రహదారిపై కామారెడ్డి వద్ద పట్టుకున్నారు.
పక్కా సమాచారం మేరకుగుజరాత్ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న వాహనాన్ని తనిఖీ చేయగా ఈ నిషేధిత డ్రగ్ బయటపడింది. రూ. 2.40 కోట్లు విలువ చేసే డ్రగ్ అక్రమ రవాణా వెలుగుచూడడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అని ఎక్సైజ్శాఖ భావిస్తోంది. దీన్ని మెదక్ జిల్లాకు తరలించేందుకు రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరిపై కేసు నమోదైంది. ఒక్కో కిలో ఆల్ప్రాజోలం ప్రస్తుతం రూ. ఆరు లక్షల వరకు ఉంటుంది. ఈ ఏడాది నిజామాబాద్ జిల్లాలోనూ మూడు ఆల్ప్రాజోలం కేసులు నమోదయ్యాయి. సుమారు ఐదు కిలోల ఈ నిషేధిత డ్రగ్ను ఎక్సైజ్శాఖ స్వాధీనం చేసుకుంది.