వైన్స్ సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు
దుకాణ నిర్వాహకులపై కేసు నమోదు
పరిగి : కొంతమంది మద్యం దుకాణాల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కాలం చెల్లిన బీర్లు విక్రయిస్తూ యథేచ్ఛగా సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై విని యోగదారులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. శనివారం సాయంత్రం పరిగికి చెందిన కొందరు పరిగిలోని న్యూ పరిగి వైన్స్లో బీర్లు కొనుగోలు చేశారు. వీటిపై డేట్ చూడగా గడువు ముగిసినట్లు గుర్తించారు. మార్చి, ఏప్రిల్ నెలల్లోనే కాలం చెల్లిన బీర్లు అమ్మారంటూ ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మద్యం దుకాణం వద్దకు చేరుకున్న అధికారులు కాటన్ బీర్లకు సంబంధించిన విక్రయ గడువు ముగిసినట్లు గుర్తించారు.
12 బీరు సీసాలను ఎక్సైజ్ ఠాణాకు తరలించి దుకాణం సీజ్ చేశారు. ఈ మేరకు వైన్స్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం స్టాక్ వివరాలు నమోదు చేసే ఎక్సైజ్ అధికారులు దీన్ని ఎందుకు గుర్తించలేదని ప్రశ్నిస్తున్నారు. అధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. లాక్డౌన్ సమయంలోనూ దుకాణంలో ఉన్న మద్యం నిల్వలు తరలించారని ఆరోపణలు వచ్చినా.. అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవరించారని మండిపడుతున్నారు.