మరణానంతరమూ జీవిస్తారు!

7 Sep, 2015 02:02 IST|Sakshi
మరణానంతరమూ జీవిస్తారు!

- ఇక్కారెడ్డిగూడ గ్రామస్తుల ఆదర్శం అభినందనీయం
- చేవెళ్ల ఆర్డీఓ చంద్రమోహన్
- నేత్రదాన అంగీకార పత్రాలు అందజే సిన 480 మంది
చేవెళ్ల రూరల్:
సృష్టిలో మానవ జన్మ ఎంతో ఉతృష్టమైంది. అలాంటి జన్మను సార్థకం చేసుకోవడానికి.. మరణించిన తర్వాత కూడా మళ్లీ బతికి ఉండే ఒకే అవకాశం నేత్రదానం ద్వారానే లభిస్తుందని చేవెళ్ల ఆర్డీఓ చంద్రమోహన్ అన్నారు. మండలంలోని  చనువల్లి అనుబంధ గ్రామం ఇక్కారెడ్డి గూడకు చెందిన గ్రామస్తులంతా సుమారు 480 మంది నేత్రదానానికి ముందుకువచ్చారు. ఆదివారం ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి టెక్నికల్ డెరైక్టర్ కిషన్‌రెడ్డికి గ్రామస్తులు తమ నేత్రదాన అంగీకార ప్రతాలను ఆర్డీఓ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్డీఓ మాట్లాడుతూ.. ఇక్కారెడ్డిగూడ గ్రామస్తుల ఆలోచన ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

మనం మట్టిలో కలిసిపోయిన తర్వాత కూడా మనకళ్లు మరొకరి జీవితంలో వెలుగులు నింపాలనే ఆలోచన ఎంతో గొప్పదని కొనియాడారు. యువత చైతన్యాన్ని ఆయన అభినందించారు. తన రెవెన్యూ డివిజన్ పరిధిలో సంపూర్ణ నేత్రదానానికి ముందుకు వచ్చిన గ్రామాలు దేవునిఎర్రవల్లి, ఇక్కారెడ్డిగూడలు ఉండటం గర్వకారణంగా ఉందని చెప్పారు. తాను ఎక్కడైనా చేవెళ్ల డివిజన్ ఆర్డీఓగా కాకుండా.. సంపూర్ణ నేత్రదానం చేసిన రెండు గ్రామాల డివిజన్‌లో ఆర్డీఓగా పనిచేస్తున్నానని గౌరవంగా చెబుకొంటానని తెలిపారు. ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రి టెక్నికల్ డెరైక్టర్ కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. సంపూర్ణ నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చిన  గ్రామస్తులను అభినందించారు.

కంటి జబ్బుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఎయిడ్స్, బ్లడ్ క్యాన్సర్ లాంటి వ్యాధులున్నవారు తప్ప మిగతావారందరూ నేత్రాలను దానం చేయవచ్చన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి,  ఎంపీటీసీ సభ్యుడు నర్సింలు, గ్రామ యువకులు చంద్రశేఖ ర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌చారిలు మాట్లాడుతూ.. అంధుల జీవితాల్లో వెలుగులు నింపే ఈ నేత్రదానం కార్యక్రమం దేవునిఎర్రవల్లిలో ప్రారంభించి ఐదేళ్లుగా విజయవంతం చేస్తున్నారని, అదే స్ఫూర్తిని తమ గ్రామ యువత తీసుకుందన్నారు.   మండలంలోలని మరిన్ని గ్రామాల్లో కూడా నేత్రదానం చేసేందకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో గ్రామస్తులు ప్రభాకర్‌రెడ్డి, పాపిరెడ్డి,  పర్యావరణ అవార్డు గ్రహీత, ఉపాధ్యాయుడు రామకృష్ణారావు, గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్, జి. రాములు, వివేకానంద యూత్ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు