జీవితంలో ఫెయిల్ అయ్యా..

12 Oct, 2014 04:42 IST|Sakshi
జీవితంలో ఫెయిల్ అయ్యా..
  • సూసైడ్‌నోట్ రాసి యువకుడి ఆత్మహత్య
  • శామీర్‌పేట్‌లో విషాదం  
  • మృతుడు కరీంనగర్ జిల్లావాసి
  • శామీర్‌పేట్: ‘నేను జీవితంలో ఫెయిల్ అయ్యాను.. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్న’ అంటూ ఓ యువకుడు తనువు చాలించాడు. సదరు యువకుడు సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకొని పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. ఎస్‌ఐ మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం..
     
    కరీంనగర్  జిల్లా మంచిర్యాలలోని శ్రీరాంపురం నివాసి ఆదిత్యపవన్(23) కొన్నాళ్ల క్రితం బీటెక్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చాడు. నారాయణగూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ కోచింగ్ సెంటర్‌లో చేరాడు. శుక్రవారం కరీంనగర్ వెళ్తున్నానని అతడు హాస్టల్‌లో చెప్పి బయలుదేరాడు. ఇదిలా ఉండగా శనివారం శామీర్‌పేట్‌లోని శివగంగా బోర్‌వెల్ కార్యాలయం వెనుక అటవీ ప్రాంతంలో ఓ యువకుడి మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.

    మృతుడి జేబులో ఉన్న ఆధార్‌కార్డు ఆధారంగా అతడు మంచిర్యాలలోని శ్రీరాంపురం నివాసి ఆదిత్యపవన్‌గా గుర్తించారు. ఘటనా స్థలానికి సమీపంలో ఓ పురుగుల మందు డబ్బా పడి ఉంది. అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు. మృతుడి జేబులో ఓ సూసైడ్ నోట్ లభించింది.

    ‘నేను జీవితంలో ఫెయిల్ అయ్యాను.. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్న’ అని ఆదిత్యపవన్ తన తల్లిదండ్రులకు రాశాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
     

మరిన్ని వార్తలు