నకిలీ మావోయిస్టుల అరెస్ట్

16 May, 2015 23:59 IST|Sakshi

 సూర్యాపేట: ప్రజాప్రతినిధికి ఫోన్ చేసి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఇద్దరు నకిలీ మావోయిస్టులను సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎంఏ రషీద్ నిందితుల వివరాలు వెల్లడించారు. గరిడేపల్లి మండలం పొనుగోడుకు చెందిన మునగలేటి లక్ష్మన్, రాంవెంకట్‌లు గత మే 4వ తేదీన పేట ఎంపీపీ వట్టె జానయ్యయాదవ్‌కు ఫోన్ చేశారు. తాము మావోయిస్టు పార్టీకి చెందన వారమని, పార్టీ ఫండ్‌గా రూ. 4 లక్షలే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15వ తేదీన  మధ్యాహ్న సమయంలో అంజనాపురి కాలనీలోని వాయుపుత్ర డిగ్రీ కళాశాలవద్దకు వచ్చామని డబ్బులు తీసుకురావాలని.. ఎంపీపీకి నిందితులు ఫోన్ చేశారు.
 
 ఎంపీపీ రూ.10 వేలు తీసుకుని వారు చెప్పిన ప్రదేశానికి వెళ్తూ పోలీసులకు సమాచరం ఇచ్చారు. నిందితులకు డబ్బులు ఇస్తుండగా పోలీసులు వెంటనే చుట్టుముట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు.అదే విధంగా వారి వద్ద నుంచి డమ్మి పిస్టల్, కేజీ గంజాయి, కత్తి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో మునగలేటి లక్ష్మణ్ అతడి స్నేహితుడు మధుతో కలిసి నేరేడుచర్లకు చెందిన రియల్ వ్యాపారి శ్రీధర్‌ను బెదిరించిన ఘటనలో గరిడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సమావేశంలో సీఐ మొగలయ్య, క్రైం ఎస్‌ఐ జబ్బార్, ఎస్‌ఐ శ్రీనివాస్, ఐడీ పార్టీ సిబ్బంది గొర్ల కృష్ణ, గోదేషి కరుణాకర్, కరణం అరవింద్, సంగి నరేందర్, దైద రాజులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు