నామ్‌కే వాస్తే.. నర్సింగ్‌ విద్య

9 Aug, 2018 03:04 IST|Sakshi

145 స్కూళ్లకు 50 స్కూళ్లు ఎక్కడున్నాయో కూడా తెలియదు

బోగస్‌ అడ్రస్‌తో ప్రభుత్వాన్ని బోల్తా కొట్టిస్తున్న వైనం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అనేకచోట్ల కేవలం కాగితాలపైనే నర్సింగ్‌ స్కూళ్లు నడుస్తున్నాయి. బోగస్‌ అడ్రస్‌లు పెట్టి విద్యార్థులను చేర్చుకొని వారిని నిట్టనిలువునా ముంచుతున్నాయి. తరగతులు నిర్వహించకుండానే పరీక్ష రాయించి వారికి సర్టిఫికెట్లు ఇస్తున్నాయి. దీంతో నర్సింగ్‌ విద్య తెలియక ఆసుపత్రుల్లో రోగులకు సరైన సేవలు చేయలేక వారు ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికెట్లు చూసి ఉద్యోగమిచ్చిన కార్పొరేట్‌ ఆసుపత్రులు, వారికి పని రాకపోవడంతో బయటకు గెంటేస్తున్నాయి. దీంతో మూడేళ్ల నర్సింగ్‌ సర్టిఫికెట్లు పొందినవారు లబోదిబోమంటున్నారు. ఇంత జరుగుతున్నా నర్సింగ్‌ కౌన్సిల్‌ ఏ విధమైన చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి.  

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే ప్రాధాన్యం
రాష్ట్రంలో ప్రైవేటురంగంలో 145 నర్సింగ్‌ స్కూళ్లు ఉన్నాయి. ఇంటర్‌ అర్హతతో కూడిన మూడేళ్ల జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) కోర్సు అందిస్తున్నాయి. ఈ కోర్సుల కోసం విద్యార్థులు ఎగబడుతుంటారు. ఈ కోర్సు చేశాక ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉద్యోగం వస్తుందని బాలికలు చేరుతుంటారు. అయితే నర్సింగ్‌ స్కూల్‌ యాజమాన్యాలు వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఒక్కో స్కూలులో 45 నుంచి 60 సీట్ల వరకు వాటి సామర్థ్యాన్ని బట్టి ఉన్నాయి. ఈ కోర్సు కోసం ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం ఏడాదికి రూ.45 వేలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లిస్తుంది. దీంతోపాటు ఇతరత్రా ఖర్చులంటూ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి రూ.20 వేల చొప్పున వసూలు చేస్తున్నాయి.

అంటే 60 సీట్లున్న ఒక్కో కాలేజీకి కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నుంచే ఏడాదికి రూ.27 లక్షలు వస్తుంటాయి. ఇలా మూడేళ్ల కోర్సులకు ఏడాదికి రూ. 81 లక్షలు వస్తుంటాయి. ఇవిగాక విద్యార్థుల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. అవి కలిపితే మరో రూ. 36 లక్షలు వస్తాయి. మొత్తం రూ. 1.17 కోట్లు ఫీజుల రూపంలోనే వస్తున్నాయి. అయితే, ఇంతింత ఫీజులు వసూలు చేస్తున్నా కనీసం తరగతులు కూడా నిర్వహించని పరిస్థితి నెలకొంది. అంతేకాదు కనీసం వాటికి సొంత భవనాలు కూడా లేవు. ఈ అక్రమాలపై కొరడా ఝళిపించాల్సిన అధికారులు మామూళ్లకు కక్కుర్తి పడుతున్నారన్న ఆరోపణలున్నాయి.  

బోగస్‌ అడ్రస్‌లు
హైదరాబాద్‌ ఎల్బీనగర్లో ఒక నర్సింగ్‌ స్కూలు ఉంది. అలాగే వనస్థలిపురంలో ఒక నర్సింగ్‌ స్కూలుంది. అవెక్కడున్నాయో ఎవరికీ తెలియదు. దాని ఇంటి నెంబర్, వీధి పేరు ఎక్కడా పేర్కొనలేదు. ఏ అడ్రస్‌కు వెళ్లాలో కూడా తెలియదు. నర్సింగ్‌ కౌన్సిల్‌ జాబితాలో పేర్కొన్న అడ్రస్‌లను పట్టుకొని వెళితే దాదాపు 50 నర్సింగ్‌ స్కూళ్లు బోగస్‌ అడ్రస్‌లు ఇచ్చినట్లు సమాచారం. విచిత్రమేంటంటే ఒకే భవనంలో 14 నర్సింగ్‌ స్కూళ్లు నడుస్తున్నాయి. అంటే ఒకే భవనంలో 14 నర్సింగ్‌ స్కూళ్లు నడుస్తున్నాయని కాదు, ఒక నర్సింగ్‌ స్కూలు యజమానే, అడ్రస్‌ లేకుండా కేవలం సర్టిఫికెట్లతో నడిపించే మిగిలిన 13 నర్సింగ్‌ స్కూళ్లతో ఒప్పందం చేసుకొని వారి విద్యార్థులకు అక్కడే తరగతులు నిర్వహిస్తున్నామని చూపిస్తున్నారు. అందుకోసం కొంత వసూలు చేస్తున్నారు. ఒక్క పూర్వ మెదక్‌ జిల్లాలోనే 8 నర్సింగ్‌ స్కూళ్లు ఇలా అక్రమంగా నడుస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.

చర్యలు తీసుకోవాలి
బోగస్‌ అడ్రస్‌లు పెట్టి, కాగితాలపై కోర్సులు నడుపుతున్న నర్సింగ్‌ స్కూళ్లను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలి. బోగస్‌ స్కూళ్లతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందుతుండటం దారుణం. దీనివల్ల నర్సింగ్‌ విద్య నాణ్యత తగ్గిపోతున్నది.
–గోవర్ధన్, చైర్మన్,

తెలంగాణ నర్సుల సమితి  ఫ్యాకల్టీలు ఏరీ?
నర్సింగ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం ఒక నర్సింగ్‌ స్కూలు ఏర్పాటు చేయాలంటే, తప్పనిసరిగా 20 వేల చదరపు అడుగుల వైశాల్యంలో భవనం ఉండాలి. నర్సింగ్‌ ల్యాబ్, పీడియాట్రిక్‌ ల్యాబ్, ప్రి క్లినికల్‌ ల్యాబ్, కంప్యూటర్‌ ల్యాబ్, స్టాఫ్‌ రూం, లైబ్రరీ, ఫ్యాకల్టీ రూం, లెక్చర్‌ హాల్‌ ఇలా 11 రకాల అంశాలకు సంబంధించినవి ఉండాలి. అంతేకాదు 100 పడకల ఆసుపత్రితో ఒప్పం దం చేసుకొని ఉండాలి. క్లినికల్‌ ప్రాక్టీస్‌ చేయిస్తుండాలి. అంతేకాకుండా ఒక్కో నర్సింగ్‌ కాలేజీలో 14 మంది బోధనా సిబ్బంది ఉండాలి. అందులో ప్రిన్సిపల్, వైస్‌ ప్రిన్సిపాల్, 10 మంది ట్యూటర్లు, ఇద్దరు అదనపు ట్యూటర్లు ఉండాలి.

కానీ ఏ స్కూల్‌లోనూ ఒకరిద్దరు మినహా ఉండటం లేదు. అసలు కాలేజీ లేకుండా, తరగతులే నిర్వహించకుండా నడుస్తున్న నర్సింగ్‌ స్కూళ్లు అయితే మరీ ఘోరం. ఆ స్కూళ్ల విద్యార్థులు కేవలం పరీక్షల సమయంలోనే వస్తారు. యాజమాన్యాలు పాస్‌ చేయిస్తాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, అదనపు ఫీజు కాకుండా, పాస్‌ చేయించినందుకు మరికొంత గుంజుతున్నారు. కోర్సు చివరి సంవత్సరంలో ఏదో ఒక ఆసుపత్రిలో శిక్షణ ఇప్పిస్తారు. ఆ శిక్షణ సమయంలో సంబంధిత ఆసుపత్రి ఎంతోకొంత విద్యార్థులకు వేతనం చెల్లిస్తుంది. అందులోనూ సగం యాజమాన్యాలే తీసుకుంటున్నాయి.

మరిన్ని వార్తలు