పూత లేదు.. కాత రాదు

1 Oct, 2016 01:42 IST|Sakshi
పూత లేదు.. కాత రాదు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మొక్కలన్నీ ఏపుగా పెరిగాయి.. కానీ పూత.. కాత లేదు.. రైతుల కోట్ల పెట్టుబడులు మట్టిపాలయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు ఖమ్మం, వరంగల్ జిల్లాలో వేలాది ఎకరాల్లో మిర్చి పంట పరిస్థితి ఇది! నకిలీ విత్తనాలతో 5 వేల మంది రైతులు నిండా మునిగారు. రూ.400 కోట్లకుపైగా నష్టపోయారు. పూత, కాత లేని మిర్చి పంటను పీకేసి పరిహారం కోసం రోడ్డెక్కుతున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో పంటలను పరిశీలించిన రాష్ట్ర స్థాయి బృందం కూడా మూడు కంపెనీల విత్తనాలు నకిలీవని నిర్ధారించింది.
 
గతం కంటే ఎక్కువగా..
రాష్ట్రంలో ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మిర్చి పంట అధికంగా సాగవుతుంది. గతేడాది క్వింటాలు మిర్చికి రూ.13వేల వరకు ధర పల కడంతో ఈసారి రైతులు సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువగా సాగు చేశారు. ఖమ్మం జిల్లాలో మిర్చి సాధారణ విస్తీర్ణం 65 వేల ఎకరాలు కాగా.. ఈసారి మరో 10 వేల ఎకరాల్లో అదనంగా (మొత్తం 75 వేల ఎకరాల్లో) సాగు చేశారు. ఆగస్టు మొదటి, రెండో వారాల్లో విత్తనాలు, నారుతో పంట వేశారు. సాధారణంగా మిర్చి పంట నెల రోజులకే పూతకు వస్తుంది, తర్వాత కాయలు ఏర్పడతాయి. కానీ ఇక్కడ నెలన్నర, రెండు నెలలవుతున్నా, చాలా చోట్ల మొక్కలు ఏపుగా పెరిగినా.. పూత రాలేదు, కాత కనబడలేదు.

దీంతో రైతులు ఏదో తెగులు సోకిందని తొలుత భావిం చారు. కానీ చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొనడంతో తాము వేసినవి నకిలీ విత్తనాలు గా గ్రహిం చారు. దీంతో మిర్చి పంటను పీకేసి.. ఆందోళనలకు దిగారు. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం, కొణిజర్ల, కూసుమంచి, చర్ల, జూలూరుపాడు, సత్తుపల్లి, వైరా, ఏన్కూరు, కారేపల్లి, టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో, వరంగల్ జిల్లాలోని తొర్రూరు, నర్సంపేట, మహబూబాబాద్, పరకాల డివిజన్లలో ఇలా పెద్ద సంఖ్యలో రైతులు నష్టపోయారు. తమకు కంపెనీల నుంచి పరిహారం ఇప్పించాలని లేదా ప్రభుత్వమైనా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
 
13 వేల ఎకరాల్లో...
ఖమ్మం జిల్లాలో 8వేలు, వరంగల్ జిల్లాలో 5వేల ఎకరాల్లో నకిలీ విత్తనాల కారణంగా నష్టం వాటిల్లింది. దీంతో పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ.. వ్యవసాయ కార్యాలయాలు,డీలర్ల దుకాణాలు, రోడ్లపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
 
అయితే... నష్టం మూడు వేల ఎకరాల వరకే ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కానీ చాలా మంది రైతులు సాగు చేసింది నాసిరకం విత్తనాలేనని, నష్టం చాలా ఎక్కువగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. విత్తనాల కొనుగోలు, సాగు ఖర్చు, పంట నష్టం కలిపి సుమారు రూ.400 కోట్లకుపైగా నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. విత్తన, సాగు ఖర్చును మాత్రమే నష్టంగా పరిగణించవద్దని.. దిగుబడిని కూడా నష్టంగా లెక్కించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం సీజన్  కూడా అరుుపోవడంతో మళ్లీ సాగు చేసే పరిస్థితి లేదని పేర్కొంటున్నారుు.
 
నకిలీ విత్తనాలు వాస్తవమే...
ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాలతో మిర్చి సాగు జరిగిందని రాష్ట్ర స్థాయి బృం దం ప్రాథమికంగా తేల్చింది. నష్టపోయిన రైతుల ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, శాస్త్రవేత్తలతో కూడిన బృందాన్ని శుక్రవారం ఖమ్మం జిల్లాకు పంపింది. తెలంగాణ ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్త సైదయ్య, వ్యవసాయ శాఖ కమిషనరేట్ డీడీ ఎం.వి.మధుసూదనరావు, ఏడీఏలు రాజారత్నం, శివానంద్, ఉద్యాన శాఖ డీడీ ఆర్.శ్రీనివాసరావు, ఏడీ కె.సూర్యనారాయణలతో కూడిన బృందం కూసుమంచి, తిరుమలాయపాలెం, కొణిజర్ల మండలాల్లో మిర్చి తోటలను పరిశీలించింది.

రైతులు సాగు చేసిన విత్తన ప్యాకెట్లను తెప్పించుకుని చూసింది. రైతులు విత్తనాల కొనుగోలుకు, సాగుకు చేసిన ఖర్చు, పంటలు వేసిన సమయం, పూత, కాత రాకపోవడం వంటి వివరాలను తెలుసుకుంది. అనంతరం అధికారులు, శాస్త్రవేత్తలు మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో జీవా, గ్రీన్ ఎరా కంపెనీ సీఎస్ 333, సుమతీ సీడ్‌‌సకు చెందిన శృతి రకం విత్తనాలలో నకిలీ శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. అన్ని తోటలలో ఆకులను సేకరించి డీఎన్ ఏ పరీక్షలకు పంపుతున్నట్లు తెలిపారు. విత్తన లోపమున్నట్లు తేలితే కంపెనీలపై, విత్తనాలు అమ్మిన డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని చెప్పారు. వరంగల్ జిల్లాలో కూడా పంట లను పరిశీలించిన అనంతరం ప్రభుత్వానికి పూర్తిస్థారుు నివేదిక ఇస్తామన్నారు.

మరిన్ని వార్తలు