నకిలీ@ ఇచ్చోడ

18 Jun, 2019 12:40 IST|Sakshi
ఇచ్చోడలో పట్టుబడ్డ రూ.25 లక్షల నకిలీ విత్తనాలు (ఫైల్‌)

సాక్షి, ఇచ్చోడ(బోథ్‌):  జిల్లాలో నకిలీ విత్తనాల దందాకు కెరాఫ్‌ అడ్రస్‌ ఇచ్చోడ అయింది. గుజరాత్‌లో తయారవుతున్న నిషేధిత బీజీ–3 విత్తనాలు అక్కడి నుంచి ఇచ్చోడకు వయా నిజామాబాద్‌ మీదుగా తరలించి రైతులకు అంటగడుతున్నట్లు తెలుస్తోంది. బీజీ–3 పత్తి విత్తనాలపై నిషేధం విధించడంతో ఇక్కడి వ్యాపారులకు కలిసొచ్చినట్లయింది. బీజీ–3 విత్తనాలు విత్తుకోవడం ద్వారా పెట్టుబడులు తగ్గడమే కాకుండా కలుపు నివారణకు ఉపయోగించే గ్‌లైఫోసెట్‌ మందుల వాడకంతో అధిక దిగుబడులు పొందవచ్చని రెండేళ్లుగా వ్యాపారులు భారీగా ప్రచారం చేశారు. ఇది నమ్మిన రైతులు విత్తనాలకోసం వ్యాపారులను ఆశ్రయించడం మొదలుపెట్టారు.

ఇదే అదనుగా భావించిన వ్యాపారులు గుజరాత్‌ నుంచి నిషేధిత బీజీ–3 విత్తనాలు దిగుమతి చేసుకుని భారీగా సొమ్ముచేసుకున్నారు. రూ.5 కోట్ల వ్యాపారం ఈఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో ఇచ్చోడ కేంద్రంగా రూ.5 కోట్ల నిషేధిత బీజీ–3 విత్తనాల వ్యాపారం కొనసాగినట్లు తెలుస్తోంది. ఇచ్చోడ కేంద్రంగా జిల్లాలోని నార్నూర్, ఇంద్రవెల్లి, జైనూర్, సిరికొండ, తలమడుగు, తాంసి, భీంపూర్, నేరడిగొండ, గుడిహత్నూర్, జైనాథ్, నిర్మల్‌ జిల్లాలోని పెంబి, మామడ, మహారాష్ట్రలోని చికిలి, మహోర్, కిన్వట్, బొదిడి ప్రాంతాల్లో భారీగా విక్రయించినట్లు తెలుస్తోంది. 450 గ్రాములున్న ఒక్క ప్యాకెట్‌ రూ.వెయ్యి నుంచి 12వందల వరకు డిమాండ్‌ను బట్టి విక్రయాలు జరిపినట్లు సమాచారం.  
రూ.40 లక్షల నకిలీ విత్తనాలు పట్టివేత 
ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ 16 వరకు ఇచ్చోడ, గుడిహత్నూర్, నేరడిగొండ ప్రాంతాల్లో రూ.40 లక్షల విలువైన నకిలీ విత్తనాలను సరఫరా చేస్తుండగా పట్టుకున్న సంఘటనలున్నాయి. నేరడిగొండ టోల్‌ ప్లాజా వద్ద ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన పత్తి విత్తనాల దుకాణం యజమాని ముర్కుటే అంగద్‌ నకిలీ విత్తనాలు నింపడానికి ఉపయోగించే రూ.5లక్షల విలువైన 5 వేల ఖాళీ ప్యాకెట్లు, కెమికల్‌ను కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతన్ని రిమాండ్‌కు తరలించి దుకాణం లైసెన్సు రద్దుచేశారు. ఈ నెల 2న ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన ప్రగతి ఏజెన్సీ యజమాని ముర్కుటే ముక్తిరాంకు చెందిన మ్యాక్స్‌ ఫికప్‌ వాహనంలో రూ.6 లక్షల విలువైన నకిలీ విత్తనాలు తరలిస్తుండగా ఇచ్చోడ వద్ద వ్యవసాయశాఖ అధికారులు పట్టుకుని పోలీసులు సమాచారం అందించారు.

పోలీసులు వాహనంతో పాటు విత్తనాలను సీజ్‌చేసి ముక్తిరాంపై కేసు నమోదు చేశారు. కాగా పదిహేను రోజుల నుంచి ముక్తిరాం పరారీలో ఉన్నాడు. అతని షాపు లైసెన్సు రద్దు చేయడానికి వ్యవసాయశాఖ జిల్లా అధికారులకు సిఫార్సు చేశారు. ఐదురోజుల కిత్రం సాయికృప ట్రేడర్స్‌కు చెందిన అడవ్‌ గంగాధర్‌కు చెందిన రూ.25 లక్షల విలువైన నకిలీ విత్తనాలు తరలిస్తుండగా  వ్యవసాయ శాఖ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారులు సంయక్తంగా పట్టుకున్నారు. గంగాధర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నార్నూర్‌ మండల కేంద్రంలోని గంగాధర్‌కు చెందిన సాయినాథ్‌ ట్రేడర్స్‌ లైసెన్స్‌ రద్దుకు ఆధికారులు నివేదిక అందజేశారు. ఈ సంఘటనలో గంగాధర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా అడవ్‌ రవికాంత్, అడవ్‌ సాయినాథ్, సుధాకర్‌ నాలుగు రోజుల నుంచి పరారీలో ఉన్నారు. గుడిహత్నూర్‌ మండలంలోని మాన్నూర్‌ వద్ద రెండురోజుల క్రితం రూ.2 లక్షల నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  

తీగా లాగితె డొంకంతా కదిలింది.
నకిలీ విత్తనాల దందాపై ‘సాక్షి’వరుస కథనలు ప్రచురించడంతో వ్యవసాయశాఖ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ ఆధికారులు రంగంలోకి దిగారు. ఇచ్చోడ కేంద్రంగా సాగుతున్న నకిలీ పత్తి విత్తనాల దందాపై ఆరా తీశారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్టులపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. శ్రీకాంత్‌ అండ్‌ కంపనీ పేరుతో మూడు నెలలుగా గుజరాత్‌ నుంచి పార్శిల్‌ వస్తున్నట్లు తెలుసుకున్నారు. దానిపై ఆరా తీశారు. ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన సాయికృప ట్రేడర్స్‌కు చెందిన కంపనీగా గుర్తించారు. ట్రాన్స్‌పోర్టుకు సంబంధించిన ఎల్లార్‌ను వెతికి పట్టుకున్న అధికారులు గుజరాత్‌ నుంచి నేరుగా నిజామాబాద్‌కు వచ్చే ట్రాన్స్‌పోర్టులో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన రోజే శ్రీకాంత్‌ అండ్‌ కంపనీకి చెందిన 12 సంచులలో 1250 ప్యాకెట్ల నకిలీ విత్తనాలు ట్రాన్స్‌పోర్టులో దొరికాయి. ఇప్పటి వరకు గుజరాత్‌ నుంచి ఈ కంపనీ పేరుపై రూ.కోటి 12 లక్షల విలువ చేసే విత్తనాలు సరఫరా అయినట్లు అధికారులు గుర్తించారు.  

ఏజెంట్ల అరెస్టుకు రంగం సిద్ధం.. 
ఇచ్చోడ కేంద్రంగా భారీగా నకిలీ పత్తి విత్తనాల వ్యాపారులు గ్రామీణ ప్రాంతాల్లో సబ్‌డీలర్లను ఉపయోగించుకున్నారు. వారి ద్వారా రైతులకు అంటగట్టారు. నకిలీ విత్తనాల కేసుల్లో అరెస్టయిన వ్యాపారులు నుంచి పోలీసులు సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ఆధారంగా ఏజెంట్ల అరెస్టుకు పోలీసులు సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వరుసగా ఇచ్చోడకు చెందిన వ్యాపారులు నకిలీ విత్తనాల కేసులో పట్టుబడడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.  

మరిన్ని వార్తలు