ఆదిలాబాద్లో కనిష్టంగా 12 డిగ్రీలు నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపైకి ఉత్తర దిక్కు నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. దీంతో తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటీవలే నైరుతి రుతుపవనాలు వెళ్లిపోవడం, ఈశాన్య రుతు పవనాలు ప్రవేశిస్తుండటంతో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు.
గత 24 గంటల్లో ఆదిలాబాద్లో అత్యంత తక్కువగా రాత్రి ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. హన్మకొండలో 5 డిగ్రీలు తక్కువగా, రామగుండంలో 4 డిగ్రీలు తక్కువగా, హైదరాబాద్లో 3 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్క ఖమ్మంలోనే సాధారణం కంటే మూడు డిగ్రీలు ఎక్కువగా 25 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. రానున్న కాలంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని, డిసెంబర్ నాటికి తీవ్రమైన చలి ఉంటుందని రాజారావు వెల్లడించారు.