మృతదేహాల కోసం ఎదురుచూపులు

7 Dec, 2019 10:27 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: వారం రోజుల క్రితం తమ బిడ్డలను పోలీసులు తీసుకెళ్లారని కనీసం వారితో ఫోన్‌లో గానీ నేరుగా వెళ్లి మాట్లాడలేకపోయామంటూ ఆ నలుగురి తల్లిదండ్రులు బోరుమంటున్నారు. కడసారి చూపుకైనా నోచుకుంటామని రోదిస్తూ శుక్రవారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వేచి చూశారు. చివరకు మృతదేహాలు రావడం లేదని సమాచారం అందడంతో కన్నీరు మున్నీరయ్యారు. మరోవైపు తమ బిడ్డలను ఏకపక్షంగా ఎన్‌కౌంటర్‌ చేశారంటూ మృతుల కుటుంబసభ్యులు శనివారం ఉదయం కూడా గుడిగండ్ల ప్రధాన రహదారిపై బైఠాయించి పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ  ధర్నాకు దిగారు. గ్రామస్తులు కూడా వారికి మద్దతు తెలిపారు.

అర్ధరాత్రి జిల్లా ఆస్పత్రి వద్ద జనం

మృతదేహాలు  ఇవ్వాలని రాస్తారోకో
నిందితులు చెన్నకేశవులు భార్య రేణుక, తల్లి జయమ్మతో పాటు శివ కుటుంబీకులు, బంధువులు గుడిగండ్ల ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు ఇలా ఎన్‌కౌంటర్‌ చేసి నా భర్తను చంపడం న్యాయామా అంటూ ప్రశ్నించింది. నా భర్త శవాన్ని నాకు అప్పగించాలని మీకు కడుపు చల్లాగా అయ్యింది కదా ఎందుకు మీరు డైరెక్ట్‌గా తీసుకెళ్లి పూడ్చేస్తారంటూ ఆవేదన వ్యక్తపరిచింది. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావారణం నెలకొంది. పోలీసు అధికారులు కలుగజేసుకొని మీ శవాలను మీకు అప్పగిస్తామని అలాంటిదేమీ లేదనడంతో వారు శాంతించి ఇంటికి వెళ్లిపోయారు. మీ సంప్రదాయం ప్రకారమే అంత్యక్రియలు జరిపేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు భరోసానిచ్చారు. 

ఆ కుటుంబాలకు న్యాయం చేయండి 
తప్పు చేసిన వారిని శిక్షించడం న్యాయమే...కానీ ఆ పేద కుటుంబాలకు దిక్కు ఎవరంటూ గ్రామస్తులు సైతం వాపోయారు. నిందితులు నలుగురిలో మహ్మద్‌ ఆరీప్, నవీన్, చెన్నకేశులు వారి తల్లిదండ్రులకు ఒక్కరే కుమారులు. ఆ కుటుంబాల జీవన పరిస్థితి ఏంటని.. ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నిరు పేద కుటుంబాలకు చెందిన వారు తప్పుచేసిన వారిని ఎన్‌కౌంటర్‌ చేసిన విధంగా పెద్ద వాళ్ల పిల్లలు తప్పు చేసినప్పుడు ఇలాగే ఎన్‌కౌంటర్‌ చేసి చంపాలని నిందితుల కుటుంబీకులు డిమాండ్‌ చేశారు.   

మరిన్ని వార్తలు