'ఆదుకోండి మేడమ్..అప్పుల పాలయ్యాను'

19 Oct, 2015 16:40 IST|Sakshi

మెదక్ : దేశానికి వెన్నెముక అయిన అన్నదాతల పరిస్థితి నేడు దీనంగా మారింది. సోమవారం మెదక్ మండలం కూచన్‌పల్లికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డిని సాయం చేయాలంటూ ఓ రైతు అర్థించడం చూసినవారిని కదిలించింది. 'ఆదుకోండి మేడమ్.. బోర్లువేసి అప్పులపాలయ్యాను..' అంటూ డిప్యూటీ స్పీకర్‌కు చిలుముల దశరథం అనే రైతు వినతి పత్రం అందజేస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, మూడు బోర్లు వేసినా చుక్క నీరు రాలేదని చెప్పాడు.

వర్షాధార పంటలు సాగు చేద్దామన్నా... ఖరీఫ్‌లో వర్షాలు లేకపోవడంతో ఎలాంటి పంట వేయలేదన్నాడు. బోర్లు వేసేందుకు, కుటుంబ పోషణకు చేసిన అప్పులు లక్షల్లో పేరుకుపోయాయని, వాటిని తీర్చే మార్గం కానరావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం కుటుంబానికి తిండి పెట్టలేని పరిస్థితిలో ఉన్నానంటూ డిప్యూటి స్పీకర్ ముందు తనగోడు వెళ్లబోసుకున్నాడు. వెంటనే స్పందించిన ఆమె అక్కడే ఉన్న ఆర్డీఓకు ఆదేశాలిస్తూ... రైతు దశరథంకు సబ్సిడీపై రెండు గేదెలు ఇప్పించడంతోపాటు అప్పులవారి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.

మరిన్ని వార్తలు