రుణాల రీ షెడ్యూల్ 8 వేల కోట్ల లోపే

16 Jul, 2014 02:25 IST|Sakshi

మిగిలిన 10 వేల కోట్ల రుణాలు ఏమి చేద్దాం ?
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేవలం రూ.8,000 కోట్ల మేర రుణాలు మాత్రమే రీ షెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన పదివేల కోట్ల రూపాయలను రైతులే బ్యాంకులకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనితో లక్షలాది మంది రైతులకు నిరాశ తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి. కరువు, వరదల వల్ల నష్టపోయిన పంటలకు సంబంధించి 90 రోజుల్లోగా  కరువు మండలాలుగా ప్రకటించాల్సి ఉన్నా, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా గుర్తించినందున, రీ షెడ్యూల్ నిబంధనలు సడలించాలని తెలంగాణ సర్కార్ రిజర్వ్ బ్యాంకును కోరుతోంది. రిజర్వ్‌బ్యాంకు ఈ విజ్ఞప్తిని మన్నించి రుణాలు రీ షెడ్యూల్ చేసి.. ఒక సంవత్సరం మారటోరియం విధిస్తుందని, ఆ తరువాత ఎప్పట్లోగా రుణాలు చెల్లించాలో మార్గదర్శకాలు జారీ చేస్తుందని ఓ అధికారి వివరించారు.
 
 రుణ మాఫీ కింద దాదాపు 17 వేల కోట్లరూపాయల పై చిలుకు భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. రిజర్వ్ బ్యాంకు  పంట రుణాల రీ షెడ్యూల్‌కే అంగీకారం తెలిపింది. బంగారు రుణాల రీ షెడ్యూల్‌కు అంగీకరించలేదు. దీనితో రీ షెడ్యూల్ కాని రైతులు బకాయిలు చెల్లిస్తే తప్ప వారికి కొత్తగా రుణాలు మంజూరయ్యే అవకాశం లేదు. అలా అని రాష్ట్ర ప్రభుత్వం పదివేల కోట్లను ఒకేసారి చెల్లించడం సాధ్యమయ్యే పనికాదని చెబుతున్నారు. ఈ రుణాలపై ఏమి చేయాలన్న అంశాన్ని బుధవారం కేబినెట్‌లో చర్చించనున్నారు.

మరిన్ని వార్తలు