ప్రభుత్వ విధానాలతోనే రైతు ఆత్మహత్యలు

21 Sep, 2017 02:03 IST|Sakshi
ప్రభుత్వ విధానాలతోనే రైతు ఆత్మహత్యలు

కాంగ్రెస్‌ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జి కుంతియా
►  కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ: ఉత్తమ్‌
►  త్వరలో కాంగ్రెస్‌ పత్రిక, టీవీ చానల్‌ వస్తోంది


సాక్షి, వికారాబాద్‌: రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణమని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా ఆరోపించారు. ‘ఇందిరమ్మ రైతుబాట’ కార్యక్రమం లో భాగంగా పరిగిలో బుధవారం జరిగిన రెవెన్యూ రికార్డుల అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. గిరిజనులు, దళితు లు, బలహీనవర్గాలవారికి ఇందిరాగాంధీ హయాం నుంచి దివంగత వైఎస్‌ వరకు లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశారన్నారు.

కేసీఆర్‌ మూడెకరాల భూమి పంపిణీ చేయకుండా, ఉన్న భూములను పట్టాదారులకు యాజమాన్య హక్కులు లేకుండా కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్, మోదీ ఇద్దరూ అబద్ధాలు చెప్పడంలో పోటీపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు 35 వేల బూత్‌ కమిటీలు వేస్తామని, 10 లక్షల మంది సభ్యులుగా ఉంటారని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతగా 2019లో పార్టీని అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.

2019లో మాదే అధికారం: ఉత్తమ్‌
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలం లో ఒక్కో రైతుకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగాలు రానివారికి నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎకరాకు పంటకు రూ.4 వేల పథకం ఎన్నికల స్టంట్‌ మాత్రమేనన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలతోనే రైతు కమిటీలా అని ప్రశ్నించారు. నాసిరకం చీరలు ఇస్తున్నారని మహిళలే వాటిని కాల్చేస్తుంటే కాంగ్రెస్‌పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తమ వార్తలు లోపలి పేజీలకే పరిమితంకాగా కేసీఆర్‌ అబద్ధాలు పతాక శీర్షికలతో వస్తు న్నాయన్నారు. త్వరలో కాంగ్రెస్‌కు చెం దిన పత్రిక, టీవీ రాబోతున్నదని చెప్పారు.

ప్రజాధనం దుర్వినియోగం: భట్టి  
భూసర్వే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం  ప్రజా ధనాన్ని వృథా చేస్తోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రకటనలకే రూ. కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. బూత్‌స్థాయి నేతలకు సర్వేపై సమాచారం తెలిపేందుకే ఈ సదస్సులు ఏర్పాటు చేశామన్నారు.

ప్రభుత్వాన్ని నిలదీయండి: జానారెడ్డి
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు నిలదీయాలని ఆ పార్టీ శాసనసభాపక్షనేత కె.జానారెడ్డి పిలుపునిచ్చారు.  కాంగ్రెస్‌పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి తది తరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు