ఈటెల రాజేందర్
సాక్షి, కరీంనగర్ : కేసీఆర్ కల 'రైతును రాజును చేయడమేమని, స్థానిక 6 మండలాల రైతులు రాజులు కాబోతున్నారని' వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు భూములు నష్ట పోకుండా కాలువలు, తూముల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కార్యచరణకు శ్రీకారం చుట్టారని ఈటెల పేర్కొన్నారు.
ఈ కాలువల ఏర్పాటు ద్వారా చొప్పదండీ, రామడుగు, గంగాధర, మల్యాల, పెగడపల్లి, ధర్మారం మండలాల రైతులకు సాగునీరు అందుతుందని తెలిపారు.మండలాల్లో రూ.271కోట్లతో 4 ప్రధాన కాలువలు, తూములు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గత 24 సంవత్సరాలుగా ఈ ఆరు మండలాలకు చెందిన ప్రజలు చెరువులో చుక్క నీటిని చూడలేదని తెలిపారు. ఈ కాల్వల నిర్మాణం ద్వారా 31వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. దీంతో రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైతుల కల నెరవేరబోతుందని ఈటెల స్పష్టం చేశారు.