గిట్టుబాటు కోసం రైతుల కలెక్టరేట్‌ ముట్టడి 

19 Feb, 2019 02:32 IST|Sakshi
సోమవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ముట్టడికి తరలివచ్చిన రైతులను అడ్డుకుంటున్న పోలీసులు

ఇందూరు (నిజామాబాద్‌ అర్బన్‌): ఎర్రజొన్న, పసుపు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ సోమవారం రైతులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. సుమారు రెండు వేల మంది రైతులు తరలిరాగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. చివరకు కొంత మంది రైతు సంఘం నాయకులను లోనికి ప్రవేశం కల్పించడంతో వారు కలెక్టర్‌ రామ్మోహన్‌రావును కలసి వినతిపత్రం సమర్పించారు. ఎర్రజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేసి క్వింటాలుకు రూ.3,500 చెల్లించాలని, పసుపు క్వింటాలుకు రూ.15,000 ధర ఇప్పించాలని కోరారు.

ప్రభుత్వం ఆదుకోకపోతే పెట్టిన పెట్టుపడి కోల్పోయి అప్పులపాలయ్యే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై కమిటీ వేస్తున్నట్లు కలెక్టర్‌ రామ్మోహన్‌రావు రైతులకు హామీ ఇచ్చారు. కాగా, భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికపై చర్చించుకున్న రైతులు, ఈ నెల 20న ఎమ్మెల్యేలను కలసి సమస్యను విన్నవించాలని, వారు స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తీర్మానించారు. 

మరిన్ని వార్తలు