ప్రాణాలైనా అర్పిస్తాం కానీ భూములు ఇవ్వం.. 

22 Aug, 2019 12:12 IST|Sakshi
ప్లకార్డులు చూపుతూ సమావేశానికి వస్తున్న హైవే భూ నిర్వాసితులు

హైవే రోడ్డు భూ సేకరణకు ఏర్పాటు చేసిన సభలో రైతుల ఆందోళన

సమావేశాన్ని వాయిదా వేసిన జేసీ అనురాగ్‌ జయంతి

సాక్షి, రఘునాధపాలెం: నాగపూర్‌– అమరావతి నేషనల్‌ హైవే భూ సేకరణ కోసం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సమక్షంలో భూములు కోల్పోయే రైతులతో బుధవారం ఏర్పాటు చేసిన  సమావేశం రైతులు అందోళనతో వాయిదా పడింది. భూములకు సంబంధించి రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు టీటీడీసీ భవనంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జేసీ అనురాగ్‌ జయంతి హాజరయ్యారు. భూములు కోల్పోయే రైతులతో పాటు ఆయా పార్టీల రైతు సంఘాల నాయకులు, పార్టీల నాయకులు పాల్గొన్నారు. తొలుత ఖమ్మం రూరల్‌ మండలం తీర్థాల పరిధిలో రైతులను చర్చలకు పిలిచారు. సమావేశంలో తీర్థాల రైతులతో పాటు రఘునాథపాలెం మండలంలోని భూములు కోల్పోయే గ్రామాలకు చెందిన రైతులంతా హాజరయ్యారు.

ప్లకార్డులతో తమ భూములు రోడ్డు కోసం ఇచ్చేది లేదని ఆందోళన చేశారు. జేసీ రైతులతో మాట్లాడుతూ మీ అభిప్రాయం తెలుసుకోవడానికి పిలిచామని, ధర విషయం, రోడ్డు వద్దా అని తెలుసుకోవడానికి పిలిచినట్లు పేర్కొన్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ తమ భూములు ఇవ్వమంటూ రైతులు జేసీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, రైతు సంఘం నాయకులు బాగం హేమంతరావు, గోకినేపల్లి వెంకటేశ్వర్లు, యస్‌.నవీన్‌రెడ్డి, ఆవుల వెంకటేశ్వర్లు, మల్లేష్, తొండల సత్యనారాయణ కార్పొరేటర్, సర్పంచ్‌లు బాధిత రైతులు తక్కిళ్లపాటి భద్ర య్య, వేములపల్లి రవి, ప్రతాపనేని వెంకటేశ్వర్లు, బోజడ్ల వెంకటయ్య, శ్రీనివాస్, నరసింహారావు, మం దనపు రవీందర్, రఘు, పాటి వెంకటేశ్వర్లు, మేదరమెట్ల శ్రీను, ప్రభాకర్‌ సూర్యం తదితరులు పాల్గొని  హైవేతో సాగు భూములు కోల్పోయి రోడ్డున పడుతామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆందోళన చేయడంతో జేసీ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పి వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు