పిడుగుపాటుతో తండ్రీ కొడుకులు మృతి

16 Oct, 2019 08:45 IST|Sakshi

సాక్షి, మరిపెడ రూరల్‌ : పొలంలో పత్తి ఏరుతుండగా ఒక్కసారిగా పడిన పిడుగు తండ్రీ కొడుకుల ప్రాణాలను బలితీసుకుంది. మరొకరు ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం తానంచెర్ల శివారు వాల్యాతండా గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. తండాకు చెందిన తేజావత్‌ కిషన్‌​ (48), భార్య తారతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో పత్తి ఏరడానికి వెళ్లారు.

ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ పత్తి ఏరుతుండగా కొడుకు తేజావత్‌ సంతోష్‌ (14) మధ్యాహ్న భోజనం తీసుకెళ్లాడు.భోజన విరామం అనంతరం అమ్మానాన్నలతో కలిసి తాను సైతం పత్తి ఏరుతుండగా.. ఆ సమయంలో ఉరుములు మెరుపులతో వాన మొదలైంది. అంతలోనే వారికి అతి సమీపంలో పిడుగు పడటంతో తండ్రీ కొడుకులు కిషన్‌, సంతోష్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. తార స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

మరిన్ని వార్తలు