పతకాలు సాధిస్తాడు.. సాయం చేయండి

20 Mar, 2019 11:38 IST|Sakshi
సుమంత్‌

వరల్డ్‌ యూనిఫైట్‌ పోటీలకు సుమంత్‌ అర్హత  

ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఇబ్బందులు  

తన కుమారుడికి సాయం చేయాలని తండ్రి వేడుకోలు

రాజేంద్రనగర్‌: వరల్డ్‌ యూనిఫైట్‌(కిక్‌ బాక్సింగ్‌) చాంపియన్‌ షిప్‌ 2019కి అర్హత సాధించిన రాజేంద్రనగర్‌కు చెందిన విద్యార్థి ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తన కుమారుడికి ఆర్థిక సాయం చేస్తే పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తాడని విద్యార్థి తండ్రి కోరుతున్నాడు. వివరాల్లోకి వెళితే...రాజేంద్రనగర్‌ ప్రాంతానికి చెందిన దేవా స్థానికంగా ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఆయన పెద్ద కుమారుడు సుమంత్‌ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.

బాల్యం నుంచే యూనిఫైట్‌లో అమితాసక్తి చూపించేవాడు. దీంతో తండ్రి అతడిని ప్రోత్సహించాడు. స్థానికంగా ఎక్కడ పోటీలు జరిగినా సుమంత్‌ పాల్గొని పతకాలు సాధించేవాడు. గత సంవత్సరం హర్యానాలో స్కూల్స్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని ద్వితీయ స్థానం సాధించాడు. ఏప్రిల్‌ 16 నుంచి 21వరకు రష్యాలో నిర్వహించే వరల్డ్‌ యూనిఫైట్‌ చాంపియన్‌ షిప్‌ 2019కి విద్యార్థి అర్హత సాధించాడు. పోటీల్లో పాల్గొనేందుకు, ఇతర ఖర్చుల నిమిత్తం రూ. 1.60 లక్షలు అవసరం. చిరు ఉద్యోగినైన తనకు అంత  స్తోమత లేదని, తెలంగాణ ప్రభుత్వం లేదా దాతలు ముందుకు వచ్చి తన కుమారుడికి సాయం చేస్తే రష్యా వెళ్లి పతకాలు సాధించుకొని వస్తాడని దేవా ధీమా వ్యక్తం చేశాడు. దయార్థ హృదయులు 84990 82474లో సంప్రదించాలని కోరాడు.    

మరిన్ని వార్తలు