విధుల్లో చేర్చుకోండమ్మా..!

26 Jun, 2020 12:39 IST|Sakshi
ప్రభుత్వవిప్‌తో సమస్యలు చెబుతున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు

కలెక్టర్‌ కాళ్ల మీద పడి వేడుకున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు

తుర్కపల్లి (ఆలేరు) : ‘మాపై దయ ఉంచి విధుల్లో చేర్చుకోడమ్మా’ అంటూ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ను వేడుకున్నారు. 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం మండల పరిధిలోని బీల్యానాయక్‌తండాలో వారు చిట్టడవి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.  హరితహారం జరుగుతున్న ప్రాంతానికి ఫీల్డ్‌ అసిస్టెంట్ల జిల్లా ముఖ్య నాయకులు, మండల ఫీల్డ్‌ అసిస్టెంట్లు వచ్చి ఫ్లకార్డుల ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కార్యక్రమం ముగిశాక బయలుదేరి వెళ్తున్న కలెక్టర్‌ అనితారామచంద్రన్‌కు వారి సమస్యను తెలిపారు. కొంత మంది ఫీల్డ్‌అసిస్టెంట్లు కలెక్టర్‌ కళ్ల మీద పడి తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కలెక్టర్‌ వారికి నచ్చజెప్పి మీ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ విప్‌ సునితామహేందర్‌రెడ్డి వద్దకు వెళ్లి తమను విధుల్లోకి తీసుకోవాలని, ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, ఇక్కడే సమస్య పరిష్కారం కాదని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్, కోశాధికారి జెర్రిపోతుల ఉపేందర్, చాంద్‌పాషా, ఇంద్రయ్య, మల్లేశ్, మాధవి, భవాని, స్వాతి, కవిత, మహేశ్, కరుణాకర్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు