హరితహారం మొక్కా.. మజాకా!

7 Sep, 2019 12:20 IST|Sakshi
గోపాల్‌రావుకు జరిమానా విధించిన ప్రతులను అందజేస్తున్న మున్సిపల్‌ కమిషనర్‌   

సాక్షి, మహబూబ్‌నగర్‌: హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కను తొలగించినందుకు పట్టణంలోని కల్పన టెక్స్‌టైల్స్‌ యజమాని గోపాల్‌రావుకు మున్సిపల్‌ అధికారులు రూ.10వేల జరిమానా విధించారు. ఇటీవలే అధికారులు హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతీ దుకాణం ఎదుట మొక్కలను నాటారు. అయితే గోపాల్‌రావు బట్టల దుకాణం ఎదుట నాటిన మొక్కను ఆయన తొలగించారు. చెట్టు తొలగించే దృశ్యాలను స్థానికులు వీడియో చిత్రీకరించి మున్సిపల్‌ అధికారులకు పంపించారు. దీంతో వారు వాల్టాచట్టం ప్రకారం సెక్షన్‌ 35, రూల్‌ నెం.26 నిబంధనల మేరకు రూ.10వేల జరిమానా విధించడంతో పాటు, తొలగించిన మొక్క స్థానంలోనే కొత్త మొక్కను నాటించారు. దాన్ని సంరక్షణ బాధ్యత బట్టల దుకాణం యజమానిదేనని కమిషనర్‌ వెంకటయ్య సూచించారు. పట్టణంలో కొందరు మేకలను రోడ్లపైకి వదులుతున్నారని, అవి చెట్ల ఆకులను తినడంతో పాటు, చెట్లను విరిచేస్తున్నాయని, హరితహారం మొక్కలు తింటే యజమానులకు కూడా జరిమానాలు విధిస్తామని తెలిపారు. 

మక్తల్‌లో మేక కట్టివేత 
మక్తల్‌: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నాటిన మొక్కలను ఓ మేక గురువారం మేయగా గమనించిన సిబ్బంది దాన్ని కార్యాలయంలో కట్టేశారు. అంతటితో ఆగకుండా మేక ఎవరిదో కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఆ యజమానికి రూ.2వేల జరిమానా వేశారు. 


ఎంపీడీఓ కార్యాలయంలో మేక    

మరిన్ని వార్తలు