భర్త ఇంటి ఎదుట భార్య మౌన దీక్ష

17 Jul, 2020 12:12 IST|Sakshi
భర్త ఇంటి ఎదుట కూర్చున్న భార్య సుధ

హుజూరాబాద్‌రూరల్‌: కాపురానికి తీసుకెళ్లాలని కోరుతూ మండలంలోని కందుగుల గ్రామంలో ఓ భార్య, భర్త ఇంటి ఎదుట మౌనదీక్షకు దిగింది. గ్రామస్తులు, బాధితురాలి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వినోద్‌తో కమలాపూర్‌ గ్రామానికి చెందిన పుల్ల సుధకు ఆరేళ్లక్రితం వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లి సమయంలో సుమారు రూ.8 లక్షల కట్నం ఇచ్చారు. ఈక్రమంలోనే కొన్నినెలలుగా వినోద్‌ అదనపు కట్నం తేవాలని వేధించసాగాడు.

కట్నం తేవాలని భార్య సుధను పుట్టింట్లో వదిలివెళ్లగా, పలుమార్లు పంచాయితీ నిర్వహించినా మార్పులేదని తెలిపారు. ఈ క్రమంలోనే ఏడాదిక్రితం హుజూరాబాద్‌ మండలంలోని తుమ్మనపల్లి గ్రామానికి చెందిన సుమలతను వినోద్‌ వివాహం చేసుకొని హైదరాబాద్‌ వెళ్లాడు. కందుగుల గ్రామానికి భర్త వచ్చిన విషయాన్ని తెలుసుకున్న మొదటి భార్య సుధ భర్త ఇంటి ఎదుట మూడురోజుల నుంచి మౌన దీక్ష చేపట్టింది. భర్త ఇంటి ఎదుట వంటావార్పూ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తోంది.

మరిన్ని వార్తలు