జూన్‌ 8, 9 తేదీల్లో చేపమందు 

22 May, 2019 02:09 IST|Sakshi

హైదరాబాద్‌: వంశపారంపర్యంగా ప్రతి ఏటా మృగశిర కార్తె ప్రవేశం రోజున ఆస్తమా రోగులకు పంపిణీ చేసే చేప ప్రసాదాన్ని వచ్చే నెల 8వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి పంపిణీ చేయనున్నట్లు బత్తిన హరినాథ్‌గౌడ్‌ తెలిపారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు పూర్తి చేసి నట్లు చెప్పారు. 8వ తేదీ ఉదయం హైదరాబాద్‌ దూద్‌బౌలిలోని బత్తిన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, అనంతరం చేప మందు ప్రసాదాన్ని తయారు చేసి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌కి తరలిస్తామని పేర్కొన్నారు.

చేప మందును 8, 9 తేదీల్లో పంపిణీ చేస్తామని అన్నారు. దాదాపు 5–6 లక్షల మంది వచ్చే అవకాశం ఉందన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు సైతం ఏర్పాటు చేశారని తెలిపారు. ఇందుకోసం హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌తోపాటు వాటర్‌ వర్క్స్, జీహెచ్‌ఎంసీ, పోలీస్, మత్స్య శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. చేప మందు పంపిణీకి 250 మంది వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నామని బత్తిన కుటుంబ సభ్యులు తెలిపారు. చేప మందు పంపిణీ కోసం ఈ నెల 28వ తేదీన కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులతో సమావేశం అవుతామని, అనంతరం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.  

మరిన్ని వార్తలు