హైదరాబాద్ శివారులో ఘటన.. మృతుల్లో నలుగురిది ఒకే కుటుంబం
హైదరాబాద్: శుభకార్యానికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు మింగేసింది. హైదరాబాద్ శివారులోని షాద్నగర్ బైపాస్ రోడ్డులో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఇందులో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. నగరంలోని కాటేదాన్ గణేష్నగర్కు చెందిన శ్రీనివాస్గౌడ్ స్థానికంగా కాంగ్రెస్పార్టీలో క్రియాశీల నాయకుడు. ఆదివారం ఉదయం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని తన సాగుభూమిలో జరుగనున్న ఓ పూజా కార్యక్రమానికి బంధువులతో కలసి కారులో బయలుదేరారు. షాద్నగర్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తోన్న ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న శ్రీనివాస్గౌడ్ కుమారులు చంద్రప్రతాప్ గౌడ్(22), సూర్యప్రణయ్ గౌడ్(20), కారు డ్రైవర్ రామాంజనేయులు (22), తమ్ముడి కుమారుడు మేహ ష్ గౌడ్(19), అక్క కుమారుడు సాయితేజ గౌడ్(12)లు మృతి చెందారు. చిన్న కుమారుడు మేఘప్రతాప్ గౌడ్(16)కు తీవ్రగాయాలయ్యాయి. కాగా, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో గణేశ్నగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికి వచ్చిన ఇద్దరు కొడుకులను పోగొట్టుకోవడంతో శ్రీనివాస్గౌడ్ రోదనకు అంతులేకుండా పోయింది.