ఓటు.. ఐదు రకాలు 

21 Mar, 2019 13:14 IST|Sakshi

సాక్షి, పాల్వంచరూరల్‌: ప్రజాస్వామ్యంలో అర్హులైన ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది. ఓటు ద్వారానే ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. ఐదు రకాలుగా ఓట్లు ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.  టెండర్‌ ఓటు, సాధారణ ఓటు, సర్వీస్‌ ఓటు, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఉన్నాయి. 

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు 
ప్రభుత్వశాఖల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు కూడా ఓటర్లే. ఎన్నికల సమయంలో వీరు ఎన్నికల విధులు నిర్వహిస్తారు. వారికి కూడా ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ను తపాలాశాఖ ద్వారా పంపించి ఓటు హక్కును వినియోగించుకుంటారు. మరికొంతమంది పోలింగ్‌ ముందురోజే ప్రత్యేకంగా ఉద్యోగులకోసం పోస్టల్‌ పోలింగ్‌ను ఏర్పాటుచేసి ఓటువేయిస్తారు. ఓట్ల లెక్కింపు అయిన తర్వాత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో సందర్భంలో పోస్టల్‌ ఓట్లే కీలకంగా మారతాయి.

 
టెండర్‌ ఓటు 
ఓటరు జాబితాలో ఓటుహక్కు ఉన్న ఓటరు పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఓటు వేసేటప్పటికీ ఆ వ్యక్తి ఓటును మరొకరు వేసినా..  సదరు వ్యక్తి  ఓటు వేయొచ్చు. ఇందుకోసం రిటర్నింగ్‌ అధికారి వద్ద తాను ఓటు హక్కును వినియోగించుకోలేదని  నిరూపించాలి. పోలింగ్‌ అధికారి హామీతో ఓటును వినియోగించుకోవచ్చు. దీన్నే టెండర్‌ ఓటు అంటారు. 


సాధారణ ఓటు 
18 సంవత్సరాలు నిండిన ప్రతీ పౌరుడు అన్నిరకాల ఎన్నికల్లో  ఓటువేసే అవకాశం కలిగి ఉంటాడు. ఇదే సాధారణ ఓటు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందేందుకు అర్హులు. ఫారం 6  ద్వారా దరఖాస్తు చేసుకుని ఆధారాలు చూపిస్తే ఓటు హక్కు కల్పిస్తారు. 

సర్వీస్‌ ఓటు 
సైనికులకోసం కేంద్ర ఎన్నికల సంఘం సర్వీస్‌ ఓటు వేసే అవకాశం కల్పించింది. ఎన్నికల సమయంలో సైన్యంలో విధులు నిర్వహించే సైనిక ఉద్యోగులు ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉంటారు. సైన్యంలోని ప్రధాన అధికారి ద్వారా/ తపాలా శాఖ ద్వారా ఓటును పంపించవచ్చు. ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫరబుల్‌ ద్వారా కూడా పంపవచ్చు.  

ప్రవాస భారతీయులకూ..  
ఈసారి జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో   ప్రవాస భారతీయులకు కూడా ఓటు హక్కు పొందేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.  ఆన్‌లైన్‌లో ఫారం 6ఏ ద్వారా దరఖాస్తులు చేసుకుని తగిన ఆధారులుచూపించి ఓటు హక్కును పొందవచ్చు.  ఓటు హక్కు పొందిన ప్రవాస భారతీయుల ఆసక్తి మేరకు విదేశాలనుంచి వచ్చి తమ ప్రాంత ప్రజాప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.    

మరిన్ని వార్తలు