ఉంగరం మింగేశాడు.. గొంతులో ఇరుక్కుంది!

22 Dec, 2019 10:41 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్: పిల్లలను అందంగా ముద్దుగా తయారుచేసి.. ఫొటోలు తీసి తల్లిదండ్రులు ముచ్చటపడిపోతుంటారు. తమ వద్ద ఉన్న నగలతో చిన్నారులను అలంకరించి.. సరదా పడుతుంటారు. అయితే, ఇలా పిల్లలను నగలతో అలకరించడం, చిన్నారి శిశువులకు ఉంగరాలు తొడిగే విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. పిల్లలకు అది ప్రమాదంగా పరిణమించవచ్చునని తాజా ఘటన చాటుతోంది. నిజామాబాద్‌ పట్టణంలో ఓ తల్లిదండ్రులు తమ ఐదు నెలల చిన్నారిని ఉంగరంతో అలంకరించారు. అయితే, చిన్నారి ఆడుతూ.. పాడుతూ అనుకోకుండా ఉంగరం మింగేశాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఆ శిశువు బాధతో విలవిలలాడిపోయాడు.

దీంతో తీవ్ర కలవరపాటుకు లోనైన తల్లిదండ్రులు బాలుడ్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించి.. ఉంగరం గొంతులో ఉన్నట్టు గుర్తించారు. చికిత్స ద్వారా గొంతు నుంచి వైద్యులు ఉంగరాన్ని తొలగించారు. ప్రస్తుతం ఐదు నెలల చిన్నారి యాసిన్ క్షేమంగా ఉన్నాడు. తమ కొడుకు క్షేమంగా బయటపడటంతో తల్లిదండ్రులూ ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు