‘శ్రీశైలం’లోకి బిరబిరా కృష్ణమ్మ 

19 Jul, 2020 01:18 IST|Sakshi

89,731 క్యూసెక్కుల ప్రవాహం.. 60.10 టీఎంసీలకు చేరిన నీటినిల్వ

ప్రకాశం బ్యారేజీ నుంచి 12,907 క్యూసెక్కులు కడలికి.. 

సాక్షి, హైదరాబాద్ ‌: శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. శనివారం సాయంత్రం ఆరుగంటలకు 89,731 క్యూసెక్కులు వస్తుండటంతో నీటిమట్టం 838.8 అడుగులకు, నిల్వ 60.10 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు, నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు.  

పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల వల్ల ఎగువన కృష్ణా నదిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది.
ఆల్మట్టి డ్యాంలోకి 36,186 క్యూసెక్కులు చేరుతుండగా, విద్యుత్కేంద్రం ద్వారా 45 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
నారాయణపూర్‌ డ్యాంలోకి 43, 570 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్‌వే, విద్యుత్కేం ద్రం ద్వారా 45 వేల క్యూ.లను దిగువకు వదులుతున్నారు. 
జూరాల ప్రాజెక్టులోకి 86,280 క్యూసెక్కులు చేరతుండగా.. స్పిల్‌ వే ఏడు గేట్లు, విద్యుత్కేంద్రం ద్వారా 84 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. 
జూరాల నుంచి వస్తున్న జలాలకు హంద్రీ, తుంగభద్ర జలాలు జతకలవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 89,731 క్యూసెక్కులు చేరుతున్నాయి. 
పులిచింతలకు దిగువన కృష్ణా నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి 17,409 క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టా కాలువలకు 4,502 క్యూసెక్కులు, సముద్రంలోకి 12,907 క్యూసెక్కులను వదులుతున్నారు. 

మరిన్ని వార్తలు