వరద తగ్గె.. గేట్లు మూసె

20 Aug, 2019 02:29 IST|Sakshi
సోమవారం వరద తగ్గుముఖం పట్టడంతో మూసుకున్న నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ గేట్లు

కృష్ణాలో క్రమంగా తగ్గుతున్న వరద ప్రవాహలు

సాక్షి, హైదరాబాద్‌ : కొన్నిరోజులుగా లక్షల క్యూసెక్కులతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వర్షాలు తగ్గడంతో బేసిన్‌లో ఎగువన ఆల్మట్టికి ఇన్‌ఫ్లో గణనీయంగా తగ్గింది. దీంతో దిగువన నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు కూడా వరద తగ్గుతుండటంతో ప్రాజెక్టుల్లో గేట్లను ఒకొక్కటిగా మూసివేస్తూ నీటి నిల్వల పెంపుదలపై అధికారులు దృష్టిసారించారు. ఆల్మట్టి పూర్తిస్థాయి నిల్వ 129 టీఎంసీలుకాగా 120 టీఎంసీల్లో నిల్వ ఉంచి మిగతా నీటిని దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్‌లోనూ గేట్లు మూసివేసి నీటిమట్టాన్ని పెంచుతున్నారు. శ్రీశైలం జలాశయానికి సోమవారం 3.16 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వస్తుండగా అధికారులు అవుట్‌ ఫ్లోను కూడా తగ్గించి 2.45 లక్షల క్యూసెక్కులను దిగువన సాగర్‌కు వదులుతున్నారు. సాగర్‌లో ప్రస్తుతం 301 టీఎంసీల నీటి నిల్వ ఉండగా 4.21 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఆ నీటినంతా అధికారులు దిగువకు వదిలేస్తున్నారు. 

మరిన్ని వార్తలు