మహా గణపతికి నేడూ పూలవర్షం

9 Sep, 2014 01:40 IST|Sakshi
మహా గణపతికి నేడూ పూలవర్షం

హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతిపై మంగళవారమూ పూలవర్షం కురవనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ మేరకు ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం ఛాపర్ ద్వారా ఐదుసార్లు తిరిగి, దాదాపు మూడు క్వింటాళ్ల గులాబీ పూలను విగ్రహంపై కురిపించేందుకు ప్రయత్నించారు. వాతావరణం, గాలి వీచే దిశ తదితర కారణాల వల్ల అవి అనుకున్న స్థాయిలో విగ్రహంపై పడలేదు. దీంతో మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్యలో నిమజ్జనానికి ముందు సాగర్ తీరంలో మరోసారి పూలవర్షం కురిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ మైకులో ప్రకటించింది.

11,116 కొబ్బరి కాయల మొక్కు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే 11,116 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్న తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నగర కన్వీనర్ చంద్రశేఖర్ (చందు) తన మొక్కు తీర్చుకున్నారు. వినాయక చవితి రోజు మొదటి కొబ్బరికాయను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా కొట్టి ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం చందు పది రోజుల పాటు రోజూ వెయ్యి కొబ్బరికాయలు కొట్టారు. చివరి రోజు సోమవారం కూడా కుటుంబ సమేతంగా విచ్చేసి 1,116 కొబ్బరి కాయలను కొట్టి గణనాథుడి మొక్కు తీర్చుకున్నారు.

>
మరిన్ని వార్తలు