చినుకు రాలదు.. చింత తీరదు!

2 Jul, 2015 01:16 IST|Sakshi

జిల్లాను కరువుచాయ కమ్ముకుంటోంది.. బోరుబావుల్లో నీరింకిపోయింది. చినుకు రాలకపోవడంతో మట్టిలో పోసిన విత్తనం మాడిపోయింది. రెక్కలుముక్కలు చేసుకున్న అన్నదాత కష్టమంతా మట్టిపాలైంది. వరుణుడి కరుణ కోసం ఎదురుచూసి.. ఎదురుచూసి ఆశ ఆవిరైంది. వాడుపట్టిన మొలకలు చూసి రైతుగుండె తరుక్కుపోతోంది.
 
 అచ్చంపేట జిల్లాలో వేసవిని తలపించే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చినుకు కురవకపోవడంతో మెట్టపంటలు ఎండిపోతున్నాయి. పత్తి, మొక్కజొన్న, జొన్న పంటలు సాగుచేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నియోజకవర్గంలోని అచ్చంపేట, అమ్రాబాద్, ఉప్పునుంతల, లింగాల, అమ్రాబాద్, ఉప్పునుంతల, వంగూరు మండలాల పరిధిలో 50శాతం మంది రైతులు విత్తనాలు విత్తారు.
 
 నీటి వనరులు ఉన్న రైతులు స్ప్రింక్లర్ల సహాయంతో భూమిని తడిపి పంటను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మెట్టరైతులు మాత్రం వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఎకరా పత్తిసాగుకు రూ.15వేల పెట్టుబడి అవుతుంది. వర్షాలు కురవకపోతే మళ్లీ ైరె తులు దుక్కిదున్ని సాగుచేయాలంటే రెట్టింపు ఖర్చవుతోంది. అచ్చంపేట వ్యవసాయశాఖ సబ్‌డివిజన్ పరిధిలోఖరీఫ్‌సాగు విస్తీర్ణం 25,890 హెక్టార్లు కాగా, ఇప్పటివరకు 13,450 హెక్టార్లు సాగుచేశారు. పత్తి పంటలు మొలకెత్తకుండా భూమిలోనే వాడిపోయాయి.
 
  బిందెలతో పంటలకు నీళ్లు
 కొత్తూరు: ఈ ఏడాది సరైన వర్షాలు కురియక రైతులు సాగుచేసిన పంటలను రక్షించుకోవడానికి నానాఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని సిద్ధాపూర్ గ్రామానికి చెందిన  రైతు శ్రీనివాస్‌రెడ్డి రెండెకరాల్లో టమాట తోటను సాగుచేశాడు. వర్షాలు ముఖం చాటేయడంతో పంట ఎండుతుంది. దీంతో ఎలాగైన పంటను రక్షించుకోవాలనే తపనతో కూలీల సాయంతో పంటకు బిందెలతో నీళ్లు పోయిస్తున్నాడు.
 
 తక్కువ వర్షపాతం న మోదు
 బాలానగర్: మండలంలో 787 హెక్టార్లలో వరిని సాగుచేశారు. 7835 హెక్టార్లలో మక్కజొన్నసాగు చేశారు.5042 హెక్టార్లలో పత్తిసాగుచేశారు. అదేవిధంగా 404 హెక్టార్లలో కందిసాగుచేశారు. అయితే విత్తనం విత్తిన నాటినుంచి వర్షాలు కురవకపోవడంతో మొలకలు వాడిపోతున్నాయి. ఇప్పటికే మండలంలోని రాయపల్లి, ముదిరెడ్డిపల్లి, నందిగామ, రాజాపూర్, తిర్మలాపూర్ తదితర గ్రామాల్లో మొక్కజొన్న మొక్కలు పూర్తిగా ఎండిపోయేదశలో ఉన్నాయి. జూన్‌లో 84 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా.. మండలంలో కేవలం 50 శాతం మాత్రమే వర్షపాతం నమోదైంది. దీంతో ఇప్పటికే అన్నదాతలు అప్పుచేసి విత్తనాలు కొనుగోలుచేస్తే మట్టిపాలయ్యాయని లబోదిబోమంటున్నారు.
 
 ఎండిపోతున్న మొలకలు
 జడ్చర్ల: నియోజకవర్గంలోని జడ్చర్ల, మిడ్జిల్, నవాబ్‌పేట, బాలానగర్ మండలాల్లో దాదాపుగా 40వేల హెక్టార్లలో పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలు సాగుచేశారు. పంటసాగు కోసం ఎకరాకు రూ.ఐదు నుంచి ఏడువేల వరకు ఖర్చుచేశారు. ఈలెక్కన నియోజకవర్గంలో దాదాపుగా రూ.8కోట్లకు పైగానే విత్తనాల సాగుకు వెచ్చించారు. తీరా వర్షం కురవకపోవడంతో విత్తనాలు భూమిలోనే ఇంకిపోయాయి. బోరు వసతి ఉన్న రైతులు స్ప్రింక్లర్ల ద్వారా మొలకలను కాపాడుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు