అలంకారప్రాయంగా ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జీలు

27 Mar, 2019 14:23 IST|Sakshi
కొండమడుగు మెట్టు వద్ద నిరుపయోగంగా ఉన్న ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి

బ్రిడ్జీలను వినియోగించని ప్రజలు

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న వైనం  

సాక్షి,బీబీనగర్‌: జాతీయ రహదారి విస్తరణ జరిగిన అనంతరం ప్రజలు రహదారులను దాటేందుకు ఏర్పాటు చేసిన ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జీలు అలంకారప్రాయంగా మారుతున్నాయి. మండలంలోని కొండమడుగు మెట్టు ,గూడూరు గ్రామాల వద్ద పుట్‌ఓవర్‌ బ్రిడ్జిలను ఏర్పాటు చేయగా ఇవి రెండు బస్‌స్టాప్‌లకు దూరంగా ఉండడంతో ప్రయాణికులు వాటిని వినియోగించుకోవడం లేదు. జాతీయ రహదారిపై ఉన్న బస్‌స్టాప్‌లకు ఆమడ దూరంలో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జీలను ఏర్పాటు చేయడంతో ప్రజలు వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. దీంతో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జీలు నిరుపయోగంగా మారుతున్నాయి.  

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా..
ప్రయాణికులకు అనువైన చోట ఫుట్‌ఓవర్‌బ్రిడ్జీలు నిర్మించకపోవడంతో ప్రయాణికులు వాటిని వినియోగించడంతో లేదు. దీంతో బ్రిడ్జీలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయి. బస్‌స్టాప్‌కు, చౌరస్తాలకు దూరంగా ఉండడంతో రాత్రి వేళల్లో మందు బాబులు వాటి పైన కూర్చొని మద్యం తాగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రయాణికులకు ఉపయోగపడాల్సిన ఫుట్‌ఓవర్‌బ్రిడ్జీలు అనుకూలమైన చోట ఉండకపోవడంతో పార్టీల బ్యానర్లు కట్టుకోవడానికి, మద్యం బాబులకు, భిక్షాటకులకు ఉపయోగపడుతున్నాయని పలువురు వాపోతున్నారు. 

నిత్యం జరుగుతున్న ప్రమాదాలు..
ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జీలు దూరంగా ఉండడంతో ప్రయాణికులు వాటిని వినియోగించుకోకుండా నేరుగా ప్రదాన చౌరస్తాల వద్ద రోడ్డును దాటుతూ అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు.కొండమడుగు మెట్టు, బీబీనగర్, గూడూరులో రోడ్డును దాటుతూ  ప్రాణాలు కోల్పొయిన సంఘటనలు ఉన్నాయి. ప్రధానంగా బీబీనగర్‌లో నిత్యం రోడ్డును దాటుతూ గాయాల బారిన పడుతున్న ఇక్కడ ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి లేకపోవడంతో ప్రజలు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. 

ఎస్కలేటర్‌ ఏర్పాటు ఎప్పుడో..?
ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జీల మెట్లు ఎక్కడానికి వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతుండడంతో సమస్యను గుర్తించిన స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రదాన చౌరస్తాల వద్ద ఎస్కలేటర్లను ఏర్పాటు చేయాలని నేషనల్‌ హైవే అధికారులకు విన్నవించారు. దీంతో కొండమడుగు, బీబీనగర్, వద్ద ఎస్కలేటర్లను ఏర్పాటు చేయడం కోసం స్థలాలను పరిశీలించినప్పటికి నేటికీ ఆదిశగా చర్యలు లేవు.

అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
బీబీనగర్‌లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి లేకపోవడం, సర్వీస్‌ రోడ్లపై సరైన వసతులు లేకపోవడంపై హైవే అధికారులకు విన్నవించి వినతి పత్రం అందజేశాం. ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జీలు బస్‌స్టాప్‌లకు దూరంగా ఉండడంతో ఎవరూ వినియోగించుకోలేకపోతున్నార – భాగ్యలక్ష్మి, సర్పంచ్, బీబీనగర్‌ 

మరిన్ని వార్తలు