విదేశీ కరెన్సీ అక్రమ రవాణా!

26 Dec, 2017 02:52 IST|Sakshi

దుబాయ్, షార్జాలకు తరలించేందుకు ఇద్దరి యత్నం

అక్కడి నుంచి బంగారం, ఫోన్లు స్మగ్లింగ్‌ చేసేందుకే..

మలద్వారం, ట్రాలీబ్యాగ్‌ హ్యాండిల్‌లో కరెన్సీ దాచివేత

శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టుబడ్డ ఇరువురు ఏజెంట్లు   

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌ నుంచి దుబాయ్, షార్జాలకు విదేశీ కరెన్సీని అక్రమ రవాణా చేయ డానికి యత్నించిన ఇద్దరికి డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు చెక్‌ చెప్పారు. వీరిచ్చిన సమాచారంతో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్‌ అధీనం లోని ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఏఐయూ) అధికారులు ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు మహారాష్ట్ర వాసుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ ప్రధాన రాకెట్‌లో కమీషన్‌ తీసుకుని పనిచేసే పాత్రధారులని గుర్తించారు. వీరిద్దరినీ కస్టమ్స్‌ అధికారులకు అప్పగించిన డీఆర్‌ఐ ఈ రాకెట్‌ మూలాలు అహ్మదాబాద్‌లో ఉన్నట్లు తేలడంతో లోతుగా ఆరా తీస్తోంది.

పక్కా ప్లాన్‌తో..
మహారాష్ట్రలోని థానేలో ఉన్న ఉల్లాస్‌నగర్‌కు చెం దిన ఓ గ్యాంగ్‌ దుబాయ్, షార్జాల నుంచి భారీగా బంగారం, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఫోన్లను భారత్‌కు స్మగ్లింగ్‌ చేస్తోంది. వీటిని అక్కడ ఖరీదు చేయడానికి అవసరమైన విదేశీ కరెన్సీ ఇక్కడే సమకూర్చుకుంటోంది. ఈ రాకెట్‌ ఇక్కడి నుంచి విదేశీ కరెన్సీని ఆయా దేశాలకు తరలించడానికి, ఖరీదు చేసిన బంగారం, ఇతర వస్తువుల్ని ఇక్కడికి తీసుకురావడానికి కమీషన్‌ పద్ధతిలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది.

అలాంటి ఏజెం ట్లలో ఉల్లాస్‌నగర్‌కి చెందిన బంటి రామ్‌నాని, రాజేంద్రప్రసాద్‌ గుప్త ఉన్నారు. ఈ రాకెట్‌ ఏ కోణంలోనూ తమపై అనుమానం రాకుండా, ఏ ఆధారాలు చిక్కకుండా పక్కాగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా వీరిద్దరూ ముంబై నుంచి విదేశీ విమానాలు ఎక్కకుండా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ఇద్దరికీ ఆదివారం ఎయిర్‌ అరేబియా ఎయిర్‌ లైన్స్, ఫ్లై దుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌ల్లో హైదరాబాద్‌ నుంచి దుబాయ్, షార్జాలకు టికెట్లు బుక్‌ చేసింది.

శనివారం అర్ధరాత్రి రామ్‌నాని, గుప్తలను డొమెస్టిక్‌ విమానంలో ముంబై నుంచి హైదరాబాద్‌ పంపింది. రూ. 99 లక్షల విలువైన యూరోలు, డాలర్లను చాకచక్యంగా ప్యాక్‌ చేసింది. ఈ కరెన్సీని రోల్స్‌గా చుట్టి ఇద్దరి మల ద్వారాలు (రెక్టమ్‌), ట్రాలీబ్యాగ్స్‌ హ్యాండిళ్లతో పాటు ప్రత్యేకంగా తయారు చేసిన చెప్పుల అడుగు భాగంలో దాచింది.


సోదాల్లో పట్టుబడ్డ నిందితులు
ఏజెంట్లు ఇద్దరూ తమ లగేజీతో ఆదివారం ఉదయం శంషాబాద్‌ విమానా శ్రయం నుంచి దుబాయ్, షార్జాలకు వెళ్లడా నికి విమానం ఎక్కనున్నారని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన డీఆర్‌ఐ యూనిట్‌కు తెలిసింది. వారిచ్చిన సమాచారంతో హైదరా బాద్‌ విమానాశ్రయంలో ఉన్న ఏఐయూ అధికారులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకు న్నారు. సోదాలు నిర్వహించి రహస్యంగా దాచిన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నా రు. రూ.20 వేల కమీషన్‌ కోసమే తాము ఈ కరెన్సీని అక్రమ రవాణా చేస్తున్నట్లు నిందితు లు అంగీకరించారు. కస్టమ్స్‌ అధికారులు వీరిద్దరిపై కేసులు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు