ఫారెస్ట్ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి

6 Apr, 2016 02:00 IST|Sakshi

మిర్యాలగూడ అర్బన్ :  ఫారెస్ట్ కానిస్టేబుల్ అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని వాసవీనగర్‌లో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన నల్లగొండ ముత్తయ్య(43) రెండు సంవత్సరాలుగా మిర్యాలగూడలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. పట్టణంలోని వాసవీనగర్‌లో ఓ మహిళతో కలిసి నివాసముంటున్నాడు. ఈ క్రమంలో  మం గళవారం ఇంటిముందు గేటుకు సెల్‌ఫోన్‌వైర్‌తో ఉరివేసుకొని మృతి చెందాడు. ఉదయం ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో టూటౌన్ పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 
 హత్యగా అనుమానం..?
 ముత్తయ్య మృతిపై అతని భార్య లక్ష్మమ్మ, తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసిన అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారని ఆరోపించారు. మృతుడు ముత్తయ్యకు గతంలోనే లక్ష్మమ్మతో వివాహం కాగా నవీన్, సతీష్ అనే ఇద్దరు కుమారులున్నారు. భార్య లక్ష్మమ్మ తన ఇద్దరు కుమారులతో చందుపట్లలోనే నివాసముంటున్నారు. ఉద్యోగ రీత్యా దేవరకొండలో ఉన్న సమయంలో మరో మహిళతో పరిచయం ఏర్పడి ఆమెకు దగ్గరయ్యాడు.
 
 దేవరకొండలో పదిహేను సంవత్సరాలు డ్యూటీ చేసిన అనంతరం మిర్యాలగూడకు బదిలీ అయ్యాడు. దీంతో ఆ మహిళతో సహా పట్టణంలోని వాసవీనగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఏమి జరిగిందో తెలియదు కానీ మృత్యువాతపడ్డాడు. మృతుడి శరీరంపై, మర్మవయవాలపై రక్తం కారిన ఆనవాళ్లు ఉన్నాయి. అలాగే గేటుకు ఉరివేసుకొని ఉంటే ఎలా ప్రాణం పోతుందనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది.
 
 దీంతో ముత్తయ్యతో కలిసి ఉండే మహిళే హత్య చేసిందని మృతుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్టు వస్తేగానీ ముత్తయ్యది హత్యా, ఆత్మహత్యా అనేది తేలనుంది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ పాండురంగారెడ్డి తెలిపారు. ముత్తయ్యతో కలిసి ఉన్న మహిళను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీ సులు తెలిపారు. ఈమెకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 
 ఏరియా ఆస్పత్రిలో మిన్నంటిన రోదనలు
 ముత్తయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న చందుపట్ల గ్రామస్తులు, బంధువులు ఏరియా ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. భార్య లక్ష్మమ్మతో పాటు మృతుడి తల్లిదండ్రులు కుమారులు విలపిం చిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
 

>
మరిన్ని వార్తలు