పంట ఎండిందని ప్రాణం తీసుకున్నాడు

19 Mar, 2015 18:22 IST|Sakshi

కష్టంచేసి పండించిన పంట కళ్లెదుటే ఎండిపోతుండటం తట్టుకోలేక ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం శాలిపేటలో ఈ ఘటన జరిగింది.

 

పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కేశవ రాజయ్య(65) తన రెండెకరాల పొలంలో వరి, మొక్కజొన్న సాగుచేశాడు. పొలంలోని బోరులో నీరు తగ్గడంతో మరో బోరు వేశాడు. కాని అది ఫెయిలైంది. ఇంతకు ముందు రెండు బోర్లు వేసినా ఫలితం లేకపోయింది. నీళ్లకోసం ఇప్పటి వరకు రూ.2 లక్షలు అప్పుచేశాడు.  పంటలు చేతికొస్తే అప్పు కొంతైన తీరుతుందని ఆశపడ్డ రాజయ్యకు నిరాశే ఎదురైంది. కళ్ల ముందే పంట ఎండిపోతుండటంతో మానసిక వేదనకు గురై.. గురువారం తెల్లవారుజామున ఇంటికి సమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు