విద్యుదాఘాతంతో రైతు మృతి

21 Mar, 2014 04:26 IST|Sakshi

 గంగాధర, న్యూస్‌లైన్: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మరుకు ఫ్యూజు వైరు వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందగా, మరొకరు ప్రాణాపయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన గురువారం మండలంలోని హిమ్మత్‌నగర్‌లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. హిమ్మత్‌నగర్‌కు చెందిన సర్వు రాజమల్లు(45) మూడెకరాల వ్యవసాయభూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఈ భూమి సమీపంలోనే ఎస్‌ఎస్ 11 ట్రాన్స్ ఫార్మర్ ఉంది. గురువారం పొలం పనిచేస్తుండగా ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజు వైరు కొట్టేసింది. గమనించిన రాజమల్లు ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేసి వైరు వేశాడు.
 
 అక్కడే ఉన్న మరో రైతు ఏగుర్ల బీరయ్యను డీపీ స్విచ్‌ఆన్ చేస్తుండగా ప్యూజ్‌లో మంటలు వచ్చి రాజమల్లు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మరో రైతు బీరయ్య సైతం విద్యుదాఘాతంతో గాయపడ్డాడు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. సంఘటన స్థలానికి ఎస్సై రాజేంద్రప్రసాద్, ఏఎస్సై రాజేశ్వర్ పరిశీలించారు. మృతుడి భార్య విజయ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. సర్పంచ్ సిరిమల్ల చంద్రమోహన్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు.

మరిన్ని వార్తలు