ప్రశ్నార్థకంగా ఖరీఫ్‌ 

13 Jul, 2019 12:45 IST|Sakshi
ఎడమ కాలువ లైనింగ్‌ పనులు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, బీడుగా ఆయకట్టు భూములు

కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి. వర్షాలు కురవక సాగునీరు లేక పంటల పరిస్థితి అయోమయంలో పడింది. రబీ సాగు ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో రైతులు దిగులుపడిపోతున్నారు. మబ్బులు కూడా రైతుల్ని ఉళకాడిస్తున్నాయే తప్ప కరుణించడం లేదు. ప్రతిరోజూ నల్లగా.. దట్టంగా కనిపిస్తాయి కానీ వాటినుంచి మాత్రం నీటి చుక్కలు రాలడం లేదు. వర్షాలు లేకపోవడంతో బోర్లు, బావులు అన్నీ ఎండిపోయి భూగర్భజలాలు కూడా అడుగంటిపోయాయి. ఇక పంటలు ఎలా పండాలి?.. జీవితాలు ఎలా గడవాలి?.. అనుకుంటూ రైతులు రోజురోజుకీ డీలాపడిపోతున్నారు. 

దేవరకద్ర(మహబూబ్‌నగర్‌) : వర్షాలు లేక ఖరీఫ్‌ పంటల సాగు ముందుకు సాగక పోవడంతో రైతులు దిగాలు పడుతున్నారు. గతేడాది ఇదే సమయానికి జూరాలకు వరదలు వచ్చి ఎత్తిపోతల పథకం ద్వారా కొయిల్‌సాగర్‌కు నీరు చేరింది. దీంతో గొలుసు కట్టు చెరువు, కుంటలకు కాల్వల ర్వారా నీటిని వదలడంతో ఖరీఫ్‌ పంటల సాగు జోరుగా సాగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు వర్షాలు లేకపోవడంతో పాటు జూరాలకు వరద రావడంలేదు. కోయిల్‌సాగర్‌ ఆయకట్టు కింది రైతులు ఆందోళన చెందుతున్నారు.   

జూరాలకు ఇన్‌ఫ్లో ఉన్నప్పుడే.
జూరాలకు ఇన్‌ఫ్లో ఉన్నప్పుడే ఎత్తిపోతలను రన్‌ చేసి కొయిల్‌సాగర్‌కు నీరందించాలనే ని బంధన ఉంది. వర్షాకాలం ఆరంభమై నెల గడి చింది. ఇప్పటి వరకు ఇన్‌ఫ్లో లేకపోవడంతో ఎత్తిపోతలను రన్‌ చేయలేక పోయారు. గతేడాది జూన్‌లోనే జూరాలకు ఇన్‌ఫ్లో రావడంతో కోయిల్‌సాగర్‌కు నీటిని పంపింగ్‌ చేసి గరిష్టస్థాయి వరకు నింపారు. గతేడాది ఖరీఫ్, రబీ పంటలకు కొంత వరకు నీటిని వదిలిన తర్వాత ప్రస్తుతం  కొయిల్‌సాగర్‌ ప్రాజెక్టులో 14 అడుగులమేర నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 33 అడుగులు కాగా పాత అలుగు స్థాయి వరకు 27 అడుగులుగా ఉంది. జూరాలకు ఇన్‌ఫ్లో ప్రారంభమైతేనే ఎత్తిపోతల రన్‌ చేసే  అవకాశముంది.  కర్నాటక, మహారాష్ట్రలలో భారీగా కురిసిన వర్షాలు కురిసి ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలు నిండిన తరువాతనే జూరాలకు నీరొచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కర్నాటక ప్రాజెక్టులు నిండక పోవడంతో జూరాలకు ఇన్‌ఫ్లోపై వచ్చే ఆశలు ఇప్పట్లో కనిపించడం లేదు.

లక్ష్యం చేరేదెప్పుడూ? 
కొయిల్‌సాగర్‌ ప్రాజెక్టు కింద దేవరకద్ర, చిన్నచింతకుంట, ధన్వాడ, కొత్తగా ఏర్పడిన మరి కల్‌ మండలాల పరిధిలో 12 వేల ఎకరాల పా త ఆయకట్టు భూములు ఉండగా, ఎత్తి పోతల పథకం ద్వార ప్రాజెక్టును నింపి అదనంగా 38,250 ఎకరాలను సాగులోకి తేవాలనే లక్ష్యం ఉంది. పాత కొత్త ఆయకట్టు కలుపుకుని మొత్తం 50,250 ఎకరాల భూములకు సాగునీరు అందించాలి. మూడేళ్లుగా ఎత్తిపోతల ప థకం ద్వారా కొయిల్‌సాగర్‌కు నీటిని పంపింగ్‌ చేస్తున్న పూర్తి స్థాయిలో లక్ష్యం నెరవేరలేదు. కేవలం పాత ఆయకట్టు కింద ఉన్న భూములకు మాత్రమే పూర్తి స్థాయిలో నీటిని వదిలారు. మీనుగోనిపల్లి వద్ద మునీరాబాద్‌లైన్‌పై పైపుల వేసిన తరువాత ఎడమ కాల్వకింద అదనపు ఆయకట్టుకు నీటిని వదిలి గొలుసు కట్టు చెరువులను నింపుతూ వచ్చారు. దీంతో 20వేల ఎకరాల వరకు ఆయకట్టు పెరిగింది. ఇక వాగుల ద్వారా నీటిని వదలడంతో భూగర్భ జలాలు వృద్ధిలోకి వచ్చి ఇటు తాగునీరు, అటు సాగునీటికి అవసరాలను కొంత వరకు తీరాయి. అయినప్పటికీ పూర్తి స్థాయి లక్ష్యం ఇంకా చేరుకోలేదు.

కాల్వల ఆధునికీకరణ  
కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టును పెంచడానికి కాల్వల ఆధునీకీకరణ చేపట్టాం. ఎడమ కాల్వకు రూ.32కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం కాల్వ లైనింగ్‌ పనులు పూర్తి కావచ్చాయి. రాజోలి నుంచి పేరూర్‌ వరకు కొత్తగా తవ్వాల్సిన కాల్వ పనులు త్వరలో ప్రారంభమవుతాయి. కాల్వల పొడిగింపుతో అదనంగా 10వేల ఎకరాలకు సాగునీరందుతుంది. కుడి కాల్వ ఆధునీకీకరణ పనులకు ప్రతిపాదనలు చేశాం. కొత్త కాల్వలు, డిస్ట్రీబ్యూటరీ వ్యవస్థ పనులు పూర్తయితే సాగు లక్ష్యం నేరవేరుతుంది. జూరాలకు ఇన్‌ఫ్లో ప్రారంభమైతే ఎత్తిపోతల రన్‌ చేసి కొయిల్‌సాగర్‌కు నీరొచ్చే అవకాశముంది.  
– నాగిరెడ్డి, డీఈ, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు 

వానకోసం ఎదురు చూస్తున్నా.. 
పోయినేడు ఉన్న రెండకరాల్లో వరి పంట పండించుకున్నా. ఈ ఏడు వానల కోసం ఎదురు చూస్తున్నా. ఊరికి పక్కనే ఉన్న వాగులో నీళ్లోస్తే వరి నాట్లు వేసుకొంటా. పంటలు వేసుకునే అదును కాలం గడిచి పోతున్న ఆశతో ఉన్నాం. వానలు ఏ యేడు కా యేడు కానరాకుండా పోతున్నాయి.            
– సాయప్ప, రైతు, బస్వాపూర్‌ 

మరిన్ని వార్తలు