నలుగురు రైతుల ఆత్మహత్య

8 Dec, 2014 01:33 IST|Sakshi

నెట్‌వర్క్:  అప్పుల బాధ భరించలేక నలుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండలం సింగంపేట గ్రామానికి చెందిన వడ్ల భాగ్యలక్ష్మి(28) తమకున్న నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ బతికేది. ఖరీఫ్‌లో వరి సాగు చేశారు. విద్యుత్ కోతలతో దిగుబడి సరిగా రాలేదు. పంట కోసం చేసిన రూ.1.10 లక్ష అప్పు ఎలా తీర్చాలని మనోవేదనకు గురైంది. ఈ మేరకు శనివారంరాత్రి ఇంట్లో పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కాపువారిగూడెంకి చెందిన నేనావత్ శ్రీను(30) తన రెండెకరాల భూమితోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని వరి, పత్తిసాగు చేశాడు.  రూ.3లక్షలు అప్పు చేశాడు. వర్షాభావ పరిస్థితులకు పంట దిగుబడి సరిగా రాక, అప్పులు తీర్చే మార్గం కనిపించక మనస్తాపానికి గురై శనివారం రాత్రి పురుగుల మందు తాగి చనిపోయాడు.

వరంగల్ జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూరుకు చెందిన రైతు పెంటపర్తి నర్సిరెడ్డి(43) 10 ఎకరాల్లో పత్తి, మూడు ఎకరాల్లో  సాగుతోపాటు  తన పెద్ద కూతురు వివాహా నికి సుమారు రూ.8 లక్షల  అప్పులు చేశాడు. పంటలు పూర్తిగా దెబ్బతినడంతో అప్పులు తీర్చేదారిలేక ఉరివేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మం డలం మల్కపేటకు చెందని జంగిటి శ్రీనివాస్(27) ఆరెకరాల్లో పత్తి, మొక్కజొన్న సాగుకు రూ.2 లక్షలు అప్పు చేశాడు. అంతకుముందు గల్ఫ్ వెళ్లేందుకు చేసిన రూ.4 లక్షలున్నాయి. ఎలా తీర్చాలనే మనోవేదనతో ఆదివారం రాత్రి పురుగుల మందు తాగాడు.
 

మరిన్ని వార్తలు