మత్తు లేక మరోలోకం!

31 Mar, 2020 03:28 IST|Sakshi
మందు దొరక్క మూర్ఛపోయిన వ్యక్తికి ఐఎస్‌ సదన్‌ వద్ద 108 సిబ్బంది చికిత్స..

మద్యం, కల్లు అందుబాటులో లేక వ్యసనపరుల తంటాలు

మతిస్థితిమితం కోల్పోయి అడ్డగోలు ప్రవర్తన..

పలువురి ఆత్మహత్యలు

ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి ఒకేరోజు వంద మంది 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యం, కల్లు విక్రయాలు అప్పుడప్పుడూ నిలిపేస్తారు. కానీ వరుసగా ఇన్నాళ్ల పాటు అందుబాటులో లేకపోవడం ఇదే తొలిసారి. దీంతో వ్యసనాపరులు నానా అగచాట్లు పడుతున్నారు. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఒకట్రెండు రోజులు అందుబాటులో ఉన్న మద్యం, కల్లును అధిక ధరలకు కొనుగోలు చేసి తాగారు. కానీ ఆ తర్వాత పూర్తిగా అం దుబాటులో లేకపోవడంతో 5–7 రోజుల్లో బయటపడే లక్షణాలు వారిని బాధపెడుతున్నాయి. దీంతో ఒక్క సోమవారమే ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలకు వంద మంది వరకు బాధితులు వచ్చారు.

ముఖ్యంగా కల్లులో కలిపే క్లోరల్‌ హైడ్రేట్, చాక్లెట్‌ పౌడర్, యూరియా, అల్ప్రాజోలమ్, డైజోఫామ్‌లాంటివి వ్యసనపరుల నాడీ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆల్కహాల్‌కు దీర్ఘకాలికంగా అలవాటుపడిన వారి మెదడులోని నాడీ కణాలు కూడా మత్తుకు అలవాటు పడి ఉం టాయని, సమయానికి ఆల్కహాల్‌ తీసుకోకపోతే అవి తీవ్రంగా స్పందిస్తాయని అంటున్నారు. వీటి ప్రభావంతోనే ఇప్పుడు మందు, కల్లుబాబులు చిందులు వేస్తున్నారని, మతి కోల్పోయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారని చెబుతున్నారు.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సమీక్ష 
రాష్ట్రంలోని మందుబాబుల విచిత్ర విన్యాసాలపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సమీక్ష నిర్వహించారు. వ్యసనానికి బానిస లై పిచ్చిగా ప్రవర్తిస్తున్న వారికి పీహెచ్‌సీల్లో చికిత్స చేయించాలని ఎక్సైజ్‌ అధికారులకు ఆదేశించారు. ఇటువంటి వారంతా యోగ, ధ్యానం, ఆటలు లాంటి వాటి ద్వారా ఉపశమనం పొందాలని సూచించారు.

కల్లు లేక నలుగురు మృతి 
రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో కల్లు లేక నలుగురు మృతిచెందారు. వికారాబా ద్‌ జిల్లా బూర్గుపల్లి నివాసి చాకలి రాచ య్య(45) ఆదివారం అర్ధరాత్రి బావి లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎక్‌మామిడికి చెందిన గొర్రె వెంకటమ్మ (50) రెండు రోజుల క్రితం కల్లు లేక సొమ్మసిల్లి పడిపోయింది. తలకు గాయాలై ఆదివారం రాత్రి మృతిచెందింది. మరో ఘటనలో కర్ణాటకకు చెం దిన మహ్మద్‌ అలీ(50).. నగరం నుంచి స్వస్థలానికి వెళ్తూ.. పరిగి మండలం లక్ష్మిదేవిపల్లిలో మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కొడిచెర్లకిS చెందిన చింతకింది లక్ష్మయ్య(39) కొన్ని రోజులుగా కల్లు దొరకకపోవడంతో పిచ్చిగా ప్రవర్తించాడు. సోమవారం విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు