‘హాట్ స్పాట్’ అంతటా నెట్!

4 Jun, 2015 01:57 IST|Sakshi
‘హాట్ స్పాట్’ అంతటా నెట్!

గ్రేటర్ నెటి(సిటీ)జన్లకు శుభవార్త. స్మార్ట్ ఫోన్..ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్...వీటిలో ఏ ఒక్కటి మీ చెంత వున్నా, ఏ మూలన మీరున్నా..సులభంగా ‘నెట్టు’కు రావచ్చు. హాయిగా ఇంటర్‌నెట్‌ను ఎంజాయ్ చేయొచ్చు. డిసెంబర్‌లోగా నగరమంతటా వై ఫై సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే 60 హాట్ స్పాట్‌లు సేవలందిస్తుండగా...వాటిని ఏకంగా రెండు వేలకు పెంచనున్నారు. ఒక హాట్‌స్పాట్ పరికరం పరిధిలో ఒకేసారి 500 మంది 5జీ సేవలు వినియోగించుకోవచ్చు.

- గ్రేటర్ వ్యాప్తంగా ఉచిత వైఫై సేవలు
- డిసెంబర్‌లోగా అందుబాటులోకి
- చర్యలు చేపట్టిన ఐటీ శాఖ
- నగరం నలుమూలలా రెండు వేల హాట్‌స్పాట్‌లు
సాక్షి, సిటీబ్యూరో:
గ్రేటర్ వ్యాప్తంగా డిసెంబరులోగా తొలి అరగంట ఉచిత వై-ఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే నగరంలో కీలకమైన పర్యాటక, దర్శనీయ కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. మాదాపూర్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో ఇప్పటికే వై-ఫై సేవలు అందుబాటులోకి రాగా.. మంగళవారం నుంచి చార్మినార్, గాంధీ ఆస్పత్రి, నిమ్స్, బిర్లామందిర్, బిర్లా మ్యూజియం, బిర్లా ప్లానెటోరియం, పబ్లిక్ గార్డెన్స్‌లో అరగంట ఉచిత సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే.

కాగా మహానగర వ్యాప్తంగా వై-ఫై సేవలు అందించేందుకు రెండువేల హాట్‌స్పాట్ పరికరాలను బీఎస్‌ఎన్‌ఎల్, క్వాడ్‌జెన్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖవర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ప్రస్తుతానికి 60 చోట్ల వీటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఒక హాట్‌స్పాట్ పరికరం పరిధిలో ఒకేసారి 500 మంది లాగిన్ అయి అత్యాధునిక 5జి సేవలు అందుకునే వీలుంటుందని చెప్పారు.

త్వరలో ఈ ప్రాంతాల్లో...
నగరంలోని టూరిస్టు హోటళ్లు, తారామతి బారాదరి, శిల్పారామం, శిల్పకళా వేదిక, ఎంజీబీఎస్, జూబ్లీబస్‌స్టేషన్లలో మరో పక్షం రోజుల్లో వై-ఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. అరగంటపాటు 300 ఎంబీ సామర్థ్యంగల డేటాను ఉచితంగా వినియోగించుకునే అవకాశం కలగనుంది. ఆ తరవాత ప్రతి అరగంటకు రూ.30 చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన రీచార్జి కార్డులను బీఎస్‌ఎన్‌ఎల్ స్టోర్లలో విక్రయించనున్నారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వై-ఫై సేవలను ప్రస్తుతానికి సుమారు 50 వేల మంది వినియోగించుకుంటున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వై-ఫై అంటే..
వైఫై అంటే.. వైర్‌లెస్ లోకల్ ఏరియా నెట్‌వర్క్ (డబ్ల్యూఐఎల్‌ఏఎన్). ఇది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్ (ఐఈఈఈ) 802.11 స్టాండర్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఆంగ్లభాషలో డబ్ల్యూఎల్‌ఏఎన్‌ను కుదించి ‘వై ఫై’ అని పిలుస్తున్నారు. అంటే ైవెర్లైస్ ఫెడిలిటీ అన్నమాట. ఒక్క వైఫై టవర్ సిగ్నల్స్ ఇండోర్‌లో అయితే 20 మీటర్లు (66 ఫీట్లు), ఔట్‌డోర్‌లో అయితే 100 మీటర్లు (330 ఫీట్లు) వరకు అందుతాయి. వైఫైతో కంప్యూటర్లు, వీడియో గేమ్స్ పరికరాలు, స్మార్ట్‌ఫోన్లు, కొన్ని రకాల డిజిటల్ కెమెరాలు, ట్యాబ్లెట్స్, డిజిటల్ ఆడియో ప్లేయర్లు వంటివెన్నో కనెక్ట్ అయి ఉంటాయి.

ఇలా వినియోగించుకోవాలి...
- మీ స్మార్ట్‌ఫోన్‌లో వై ఫై ఆప్షన్‌పై క్లిక్‌చేసి మీ మొబైల్ నెంబరును, ఈ-మెయిల్ అడ్రస్ టైప్‌చేసి సబ్‌మిట్‌చేయాలి
- ఆ తర్వాత మీ మొబైల్‌కు యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఎస్‌ఎంఎస్ రూపంలో అందుతాయి.
- రెండో బాక్సులో యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ టైప్‌చేసి లాగిన్ కావాలి. అపుడు అరగంటపాటు ఉచితంగా వైఫై సేవలు అందుతాయి.


సిగ్నల్స్ ఇలా..
తీగల అవసరం లేకుండా నిర్ణీత పరిధిలో హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందడమే వైఫై. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకున్న తర్వాత వైఫై రౌటర్ పరికరాన్ని అమర్చుతారు. ఈ పరికరం బ్రాడ్ బ్యాండ్ ద్వారా అందే ఇంటర్నెట్‌ను నిర్ణీత పరిధిలో వైఫై సౌకర్యం కలిగి ఉన్న ఫోన్లు, కంప్యూటర్లు వంటివాటికి ఇంటర్నెట్ సిగ్నల్‌ను అందిస్తాయి. సులువుగా చెప్పాలంటే మనం బ్లూటూత్ ద్వారా ఫోటోలు, పాటలు పంపినట్లే వై-ఫై ఇంటర్నెట్ సేవలను అందిస్తుందన్నమాట.

మరిన్ని వార్తలు