స్నేహితులున్నవారు జీవితంలో ఓడిపోరు

4 Aug, 2019 10:35 IST|Sakshi
చేవెళ్ల ఎంపీ  డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి ఆయన ప్రాణస్నేహితుడు తిరుపతిరెడ్డి ఫ్యామిలీ

సాక్షి, చేవెళ్ల: ‘స్నేహితుల విలువ వెల కట్టలేనిది. స్నేహితులు ఉన్న వారు జీవితంలో ఓడిపోరు. అది నా జీవితంలో జరిగింద’ని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆయన తన ప్రాణ స్నేహతుడి గురించి ‘సాక్షి’తో పంచుకున్నారు. నా జీవితంలో   స్నేహితుడు తిరుపతిరెడ్డిది ప్రత్యేక స్థానం. డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ , తిరుపతిరెడ్డి అంటే ఒక్కటే అన్నట్లుగా మా స్నేహం గురించి అందరికీ తెలుసు. వేరువేరు కుటుంబాలుగా ఉన్నా ఇద్దరం ఒక్కటే. మా  ఇద్దరి పిల్లలు కూడా   మంచి  స్నేహితులుగా  ఉన్నారు. వరంగల్‌లో ఇంటర్‌ చదువుతున్న సమయంలో కలిశాం.  రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ యూనివర్సిటీలో  వెటర్నరీ డాక్టర్లుగా  విద్యాభ్యాసం చేసి  3వేల రూపాయలకు ఉద్యోగం చేశాం.

కలిసి చదువుకున్నాం. కలిసి ఉద్యోగం చేశాం. కలిసి వ్యాపారం ప్రారంభించి పౌల్ట్రీ రంగంలోనే  నెంబర్‌ వన్‌స్థానానికి ఎదిగాం. ఇప్పటికీ  మేము కలిసే ఉంటున్నాం.  సమయం ఉన్నప్పుడు ఫ్యామిలీలు కలిసి టూర్లకు వెళ్తాం.  కలిసే ఏ నిర్ణయమైనా తీసుకుంటాం.  మా స్నేహం గురించి కేటీఆర్‌కు,  ఈటల రాజేందర్‌ తదితర రాజకీయ ప్రముఖలకు సైతం తెలుసు. వ్యాపారం నుంచి నేను రాజకీయాల్లోకి  వస్తున్న విషయం కూడా ముందుగా మేము ఇద్దరం మాట్లాడుకున్నాం.  ఆ తరువాతే  నేను  రజకీయాల్లోకి వచ్చాను. ఎప్పటీకీ మా స్నేహం  ఇలాగే ఉంటుంది. అందుకే స్నేహితుల విలువ వెలకట్టలేనిది అన్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.

మరిన్ని వార్తలు